తూర్పుగోదావరి జిల్లా: జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 28 ఏళ్ల వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక, ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్కు సినిమా చూసేందుకు వెళ్లారు. మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు స్వల్ప వాగ్వాదం జరిగింది.
సినిమా ముగిసిన తర్వాత డాక్టర్ ప్రియాంక తన స్కూటీపై ఇంటికి బయలుదేరారు. ఏవీ అప్పారావు రోడ్డుపై వెళ్తుండగా, పార్కింగ్లో గొడవపడిన యువకులు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఆమె స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ధాటికి ఆమె రోడ్డుపై పడిపోగా, ఆ కారు ఆమె తలపై నుంచి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.
తీవ్ర తలగాయాల పాలైన ఆమెను స్థానికులు తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ ఆమె బ్రెయిన్డెడ్గా మారినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రకాశ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును, అందులో ప్రయాణించిన నామవరం ప్రాంతపు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ వద్ద జరిగిన వివాదం మనసులో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.


