రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్‌ | Chhattisgarh CM Honours Gyaneshwari Yadav Rs 30 lakh reward, DSP promotion | Sakshi
Sakshi News home page

‘వెండికొండ’కు రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్‌

Aug 4 2026 12:26 PM | Updated on Aug 4 2026 12:41 PM

Chhattisgarh CM Honours Gyaneshwari Yadav Rs 30 lakh reward, DSP promotion

PC: X

కామన్‌వెల్త్‌ క్రీడలు-2026లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్‌ జ్ఞానేశ్వరి యాదవ్‌ను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సముచితరీతిలో గౌరవించింది. ఆమెకు రూ.30 లక్షల నగదు బహుమతితో పాటు ఉద్యోగంలో కూడా ప్రమోషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ ప్రకటించారు. కాగా తాజా కామన్‌వెల్త్‌ క్రీడల ఎడిషన్‌లో మహిళల 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌ సిల్వర్‌ మెడల్‌ గెలిచింది.

స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 111 కిలోల బరువు.. మొత్తంగా 199 కిలోల బరువు ఎత్తింది జ్ఞానేశ్వరి. నైజీరియాకు చెందిన ఒనోమ్‌ ఒమెలొలా దీదీ మొత్తంగా 206 కిలోల బరువునెత్తి స్వర్ణం గెలవగా.. రెండో స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి రజతం కైవసం చేసుకుంది.

రూ. 30 లక్షల క్యాష్‌ రివార్డుతో పాటు
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ రాయ్‌పూర్‌లోని  తన నివాసంలో జ్ఞానేశ్వరిని సత్కరించారు. రాష్ట్రాన్ని గర్వపడేలా చేశావంటూ ఆమెను అభినందించారు. ‘‘రాజ్నంద్‌గావ్‌కి చెందిన ప్రతిభ గల మా అమ్మాయి జ్ఞానేశ్వరి యాదవ్‌ను ఈరోజు సీఎం నివాసంలో సత్కరించుకున్నాము. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఆమె రజత పతకం గెలిచింది.

తొలి ప్రయత్నంలోనే పతకంతో తిరిగి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. యువత, దేశంలోని కుమార్తెలందరికీ ఆమె విజయం స్ఫూర్తిదాయకం. ఇందుకు ప్రతిగా రూ. 30 లక్షల క్యాష్‌ రివార్డుతో పాటు డీఎస్పీగా ప్రమోషన్‌ ఇస్తున్నాము. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందే ఉంటుంది’’ అని సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

నిబంధనలు సడలించి
కాగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసు విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌ ప్రస్తుతం అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ)గా పని చేస్తోంది. అయితే, ఆమె కోసం  నిబంధనలు సడలించి డిప్యూటీ సూపరింటెండెట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) గా ప్రమోట్‌ చేస్తున్నట్లు సీఎం విష్ణుదేవ్‌ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. కామన్‌వెల్త్‌ క్రీడలు-2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. మీరాబాయి చాను స్వర్ణం గెలవగా.. భారత్‌ ఖాతాలో మరో ఆరు రజత, ఒక కాంస్య పతకం చేరాయి. రిషికాంత సింగ్‌, రాజా ముత్తపండి, వల్లూరి అజయ్‌ బాబు, లవ్‌ప్రీత్‌ సింగ్‌, జ్ఞానేశ్వరి యాదవ్‌, హర్జీందర్‌ కౌర్‌ (రజతాలు), బింద్యారాణి దేవి (కాంస్యం) పతకాలు సాధించారు.

చదవండి: గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్‌ ప్లేయర్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement