గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్‌ ప్లేయర్లు! | Senior players Expressed reservations over Gambhir coaching style: Report | Sakshi
Sakshi News home page

గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్‌ ప్లేయర్లు!

Aug 4 2026 11:26 AM | Updated on Aug 4 2026 11:40 AM

Senior players Expressed reservations over Gambhir coaching style: Report

కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో గంభీర్‌ (PC: BCCI X)

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ వైఖరి పట్ల సీనియర్‌ ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే.

ఘోర పరాభవాలు
ఈ క్రమంలో బీసీసీఐ ఏరికోరి గంభీర్‌తో ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేసింది. అయితే, అతడి మార్గదర్శనంలో విజయాల మాట పక్కనపెడితే.. టీమిండియా ఇప్పటికే  ఎన్నో ఘోర పరాభవాలు చవిచూసింది. ముఖ్యంగా టెస్టుల్లో సొంతగడ్డ మీదే న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా జట్ల చేతిలో వైట్‌వాష్‌ అయింది.

ఇటీవల టీ20 సిరీస్‌లో పసికూన ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌ అయింది. అయితే, భారత జట్టు ఇలా అవమానకర రీతిలో పరాజయాల పాలైనప్పుడు గంభీర్‌.. ఆ తప్పును ఆటగాళ్లు లేదంటే సహాయక సిబ్బందిపై నెట్టేస్తున్నాడనే భావన జట్టు అంతర్గత సభ్యుల్లో నిండిపోయినట్లు సమాచారం.

తప్పంతా మాపైనే నెట్టేస్తారా?
ఏ ఒక్క ఓటమికి కూడా గంభీర్‌ జవాబుదారీగా ఉండకుండా తప్పంతా తమపైనే నెట్టేయడాన్ని కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అపెక్స్‌ సభ్యులకు వీరు అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు క్రిక్‌బ్లాగర్‌ పేర్కొంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దల్లో కొంతమంది గంభీర్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ అతడికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాల్లో తలదూర్చడం సరైన పద్ధతి కాదనే యోచనలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అసంతృప్తి, సందేహాలు
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు క్రిక్‌బ్లాగర్‌తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్‌ కోచింగ్‌ శైలి, అతడి తీరు పట్ల కొంతమంది సీనియర్‌ క్రికెటర్లు బీసీసీఐ అపెక్స్‌ మండలి వద్ద అసంతృప్తి, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, అనధికారికంగానే వారు ఈ ఫిర్యాదు చేశారు. కాబట్టి శ్రీలంక పర్యటన నేపథ్యంలో గంభీర్‌పై పెద్దలు దృష్టి సారించారు’’ అని పేర్కొన్నాయి.

లంక టూర్‌లో రాణిస్తేనే..
కాగా ఆగష్టు 15-28 మధ్య టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో టీమిండియా ఫైనల్‌ రేసులో ఉండాలంటే శ్రీలంకను 2-0తో వైట్‌వాష్‌ చేయాల్సిందే. 

ఒకవేళ ఇక్కడ ప్రతికూల ఫలితం వస్తే గనుక గంభీర్‌ భవితవ్యం (టెస్టు కోచ్‌గా) ప్రశ్నార్థకంగా మారనుంది. గంభీర్‌ కోచ్‌గా వచ్చిన తర్వాతే తొలిసారి భారత్‌ కనీసం డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్‌ కూడా చేరకుండా నిష్క్రమించింది.

చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement