సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని సంతకం. మాస్టర్ బ్లాస్టర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు, అరుదైన రికార్డులను సాధించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే రోల్మోడల్. అయితే క్రికెట్ గాడ్గా పేరు గాంచిన సచిన్ కెరీర్లో ఎవరికీ తెలియని ఒక రహస్యముంది.
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడానికి రెండేళ్ల ముందే... సచిన్ పాకిస్తాన్ జట్టు తరఫున మైదానంలోకి దిగాడు. అవును మీరు విన్నది నిజమే. 1987లో బ్రబోర్న్ స్టేడియంలో పాక్ తరపున సబ్స్ట్యూట్గా సచిన్ ఫీల్డింగ్ చేశాడు.
అసలేమి జరిగిదంటే?
1987 ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ ఐదు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్లో తలపడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్లు ఆరంభానికి ముందు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా భారత్-పాకిస్తాన్ మధ్య 40 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు.
ఈ మ్యాచ్కు ముంబైలోని చార్రిత్మక బ్రబోర్న్ స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్కు సచిన్ బాల్ బాయ్గా ఉన్నాడు. అప్పటికి టెండూల్కర్ వయస్సు వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. అయితే లంచ్ బ్రేక్ సమయంలో పాక్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ విశ్రాంతి కోసం హోటల్కు తిరిగి వెళ్లిపోయారు.
దీంతో మైదానంలో ఫీల్డింగ్ చేయడానికి ఇద్దరు సబ్స్ట్యూట్స్ అవసరమయ్యారు. వెంటనే అప్పటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్.. అక్కడి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఛార్జ్ దగ్గరకు వెళ్లి ఇద్దరు లోకల్ కుర్రాళ్లను సబ్స్ట్యూట్గా ఫీల్డింగ్ పంపంచండి అని అడిగాడు.
హేమంత్ ఎవరిని పంపాలా అని ఆలోచిస్తుండగా 13 ఏళ్ల సచిన్ నేను వెళ్తా అని ముందుకొచ్చాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాకిస్తాన్ గ్రీన్ జెర్సీ ధరించి మైదానంలో అడుగుపెట్టాడు. మైదానంలోకి వెళ్లిన సచిన్ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయమన్నారు. నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఒక భారీ షాట్ కొట్టగా... బంతి గాల్లోకి లేచింది.
సచిన్ చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ కపిల్ కొట్టిన బంతి బౌండరీ అవతల పడింది. మాస్టర్ బ్లాస్టర్ ప్రత్యామ్నాయ ఫీల్డర్గా సుమారు 25 నిమిషాల పాటు మైదానంలోనే ఉన్నాడు. సచిన్ తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించాడు.
ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ జట్టు తరపున ఓసారి ఫీల్డింగ్ కూడా చేశాను. ఆ విషయం ఆయనకు గుర్తుందో లేదో అని సచిన్ రాసుకొచ్చారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అక్కడికి సరిగ్గా మూడేళ్ల తర్వాత టెండూల్కర్.. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ వంటి స్టార్లు ఉన్న పాక్ జట్టుపైనే తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?


