న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న నిరసనల కవరేజ్ నేపథ్యంలో, పాకిస్థాన్లోని పలు ప్రాంతాలలో ‘అల్ జజీరా ఇంగ్లీష్’తో సహా పలు వార్తా వెబ్సైట్లను నిలిపివేశారు. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు, భద్రతా బలగాల అణచివేతపై విస్తృతమైన వార్తా కథనాలు వెలువడుతున్న తరుణంలో ఈ డిజిటల్ సెన్సార్షిప్ అమలైనట్లు సమాచారం.
పీఓకేలో ఎన్నికల ప్రక్రియ, నిరసనలపై అల్ జజీరా ‘ఎంపిక చేసిన వార్తాకథనాలు’ (సెలెక్టివ్ రిపోర్టింగ్) ప్రసారం చేస్తోందని పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల ప్రామాణికతను ఏబీపీ న్యూస్ స్వతంత్రంగా ధృవీకరించలేదు. ముజఫరాబాద్లో ఓటింగ్కు ఎవరూ ముందుకు రాని విధంగా వాతావరణం ఉందని, గత 50 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ నిలిపివేత కారణంగా అక్కడి పరిస్థితులను నివేదించడం కష్టతరమైందని అల్ జజీరా పేర్కొంది.
ముజఫరాబాద్లో మార్కెట్లు, బ్యాంకులు, పెట్రోలు బంకులు మూతపడ్డాయని, ప్రజా రవాణా నిలిచిపోయిందని తెలిపింది. ఆగస్టు 10 వరకు దశలవారీగా పీఓకేలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి ఇప్పటివరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాలలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, జూన్ 2న పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, పలు యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించేందుకు ఇస్లామాబాద్ కోర్టు గతంలో ప్రయత్నించింది.
ఇది కూడా చదవండి: ‘చాందీపురా’ కలకలం: 22 మంది మృతి.. 35 మందికి పాజిటివ్


