అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టారిఫ్ విధానానికి సొంత దేశంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్ సహా 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలను నిలిపివేయాలని కోరుతూ అమెరికాలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తన అధికారాలను మించి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన ఈ పిటిషన్.. ఆయన వాణిజ్య విధానానికి మరో న్యాయ పరీక్షగా మారింది.
ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 301 కింద కొత్త టారిఫ్లను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉన్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఇవి వర్తిస్తున్నాయి. అయితే బలవంతపు కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడం, వాణిజ్య నిబంధనలను కఠినతరం చేయడమే ఈ టారిఫ్ల ఉద్దేశమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.
“అధ్యక్ష అధికారాలను ఆయన దాటారు”
ఈ టారిఫ్లను వ్యతిరేకిస్తూ 25 డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్(U.S. Court of International Trade) దాఖలు చేశాయి. ఒరెగాన్, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఈ న్యాయపోరాటంలో ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం గతంలో కోర్టులు తప్పుబట్టిన విస్తృత టారిఫ్ విధానాన్నే మరో చట్టపరమైన మార్గంలో అమలు చేస్తోందని రాష్ట్రాలు ఆరోపించాయి. సెక్షన్ 301ను సాధారణంగా నిర్దిష్ట దేశాలు లేదంటే పరిశ్రమల అన్యాయ వాణిజ్య చర్యలపై ఉపయోగిస్తారని.. దాదాపు అన్ని దిగుమతులపై భారీ సుంకాలు విధించేందుకు ఉపయోగించలేమని వాదించాయి.
ఈ కేసు ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు పరిశీలనలో ఉంది. పిటిషన్పై తదుపరి విచారణ షెడ్యూల్ కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కోర్టు నిర్ణయం ట్రంప్ టారిఫ్ విధాన భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది.
భారత్పై ప్రభావం ఎంత?
ట్రంప్ కొత్త టారిఫ్ల పరిధిలో భారత్ కూడా ఉంది. తొలుత భారత్పై 12.5 శాతం సుంకం విధించగా.. కొన్ని చర్యల తర్వాత దాన్ని 10 శాతానికి తగ్గించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే చమురు, సహజ వాయువు, ఎరువులు వంటి కొన్ని ఉత్పత్తులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ భారత్ నుంచి అమెరికాకు వెళ్లే పలు ఉత్పత్తులపై ఈ టారిఫ్ల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ టారిఫ్ విధానంపై వరుస ఎదురుదెబ్బలు
టారిఫ్లను అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు కీలక ఆయుధంగా ట్రంప్ భావిస్తున్నారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. అమెరికా తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అయితే ఆయన తీసుకున్న టారిఫ్ నిర్ణయాలకు ఇప్పటికే న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన భారీ సుంకాలపై అమెరికా కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం ట్రంప్ ప్రభుత్వం ఇతర చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.
మరోసారి కోర్టు తీర్పుపైనే ఉత్కంఠ
తాజాగా 25 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్.. ట్రంప్ వాణిజ్య విధానానికి కీలక పరీక్షగా మారింది. కోర్టు ఈ టారిఫ్లను నిలిపివేస్తే ట్రంప్ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వం వైపు మొగ్గుచూపితే.. భవిష్యత్తులో మరిన్ని దేశాలపై సుంకాల విధింపుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం అమెరికా కోర్టు నిర్ణయం కోసం వాణిజ్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ తీర్పు భారత్ సహా పలు దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.


