పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పుడు సౌదీ రంగప్రవేశం ఆసక్తిగా మారింది. ఇరాక్లో అమెరికాతో కలిసి ఇరాన్ ప్రాక్సీలపై విరుచుకపడ్డ సౌదీ అంతలోనే.. ఇరాన్పై పెద్దఎత్తున దాడులు చేయవద్దని ట్రంప్కు విజ్ఞప్తి చేసింది. దీనికి తల ఊపిన ట్రంప్ సౌదీ ఎంట్రీతో తాత్కాలికంగా దాడుల ఆలోచన విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే అమెరికాని ఒప్పించేలా సౌదీ మధ్యవర్తిత్వం చేయడంపై ఒక పెద్దకారణం దాగున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ట్రంప్ ఇరాన్కు భారీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరిన్ని దాడులు చేయకుండా నివారించాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) కోరినట్లు అమెరికా అధికారులు తెలిపారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. అయితే దీని వెనుక "క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్థిక ప్రణాళిక 'విజన్ 2030' కారణమని తెలుస్తోంది.
రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా బిన్ ఫరాహ్ అల్-షయా మాట్లాడుతూ.. "రాజ్యంలోని విజన్ 2030 అనేది కేవలం ఒక ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు. విభిన్నమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి, అలాగే పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, పర్యాటకం ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్గా సౌదీ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఇదొక సమగ్ర జాతీయ ప్రాజెక్ట్" అని పేర్కొన్నారు. ఇరాన్పై ఏవైనా పెద్ద దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని, ఇది తమ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుందని సౌదీ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.
మాజీ యూఎస్ రక్షణ శాఖ అధికారి, మిడిల్ ఈస్ట్ నిపుణురాలు డానా స్ట్రౌల్ మాట్లాడుతూ.. యెమెన్ హూతీ తిరుగుబాటుదారుల ముప్పును తొలగించడానికి కేవలం సైనిక బలప్రయోగం మాత్రమే సరిపోదని సౌదీ అరేబియా చాలా కష్టపడి నేర్చుకుందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు సైనిక చర్యలు చేపట్టినా హూతీల ముప్పును పూర్తిగా తొలగించలేకపోయాయని, సౌదీ మళ్లీ అటువంటి పెద్ద సంఘర్షణలోకి దిగితే అది 'విజన్ 2030'పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా అధికారులతో చర్చలు జరిపారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే లేదా అలాంటి దాడులకు ఇతర దేశాలు మద్దతు ఇస్తే ఇరాన్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా యుఎస్ను బుజ్జగించాల్సి వస్తోంది.


