భారతీయులే టార్గెట్‌.. ఆ దేశంలో కొత్త దందా! | Indians kidnapping And exploiting Indian tourists in Thailand | Sakshi
Sakshi News home page

భారతీయులే టార్గెట్‌.. ఆ దేశంలో కొత్త దందా!

Aug 3 2026 9:09 AM | Updated on Aug 3 2026 9:09 AM

Indians kidnapping And exploiting Indian tourists in Thailand

థాయ్‌లాండ్‌... అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే పర్యాటక ప్రదేశాలు, ఉత్సాహభరితమైన నగర జీవనం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు సెలవులు గడపడానికి ఈ దేశాన్ని ఎంచుకుంటారు. మరికొందరు మంచి ఉద్యోగ అవకాశాల కోసం అక్కడికి వెళ్తారు. కానీ కొంతమందికి ఈ విదేశీ ప్రయాణం ఊహించని భయానక అనుభవంగా మారుతోంది. పర్యాటకం, ఉద్యోగ అవకాశాల పేరుతో ఆకర్షించి భారతీయులను నేర ముఠాలు టార్గెట్‌ చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరింత కలవరపరిచే విషయం ఏమిటంటే.. కొన్ని ఘటనల్లో నేరాలకు పాల్పడుతున్న వారిలో భారతీయులే ఉండటం.

ఇటీవల బ్యాంకాక్‌కు చేరుకున్న ముగ్గురు భారతీయులు సెలవు కోసం వెళ్లి కిడ్నాప్‌కు గురయ్యారు. తక్కువ ధరలో థాయ్‌లాండ్‌ ట్రిప్‌ పేరుతో వారిని నమ్మించిన ఓ ముఠా పట్టాయాలోని ఓ ఇంటికి తీసుకెళ్లి వారం రోజుల పాటు బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు వారిని చిత్రహింసలకు గురిచేసి, కుటుంబ సభ్యులను బెదిరించేందుకు వీడియో కాల్స్‌ ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల కుటుంబ సభ్యులు థాయ్‌ పోలీసులను సంప్రదించడంతో అధికారులు రంగంలోకి దిగారు. దాడి చేసి ముగ్గురినీ రక్షించారు. పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో భారతీయులు కూడా ఉండటం ఈ ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చింది.

థాయ్‌లాండ్‌కు భారతీయుల రాక ఇటీవలి సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది. బ్యాంకాక్‌, పట్టాయా, ఫుకెట్‌ వంటి ప్రాంతాలు భారతీయ పర్యాటకుల్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. మరోవైపు అక్కడ భారతీయ మూలాలున్న ప్రజలు, భారతీయ పౌరులతో కూడిన పెద్ద సమాజం కూడా ఉంది. వస్త్ర పరిశ్రమ, ఆభరణాల వ్యాపారం, హాస్పిటాలిటీ, ఐటీ, ఆర్థిక రంగం, వైద్య రంగాల్లో పలువురు భారతీయులు తమ స్థానం ఏర్పరుచుకున్నారు. అయితే ఇదే పరిస్థితిని కొన్ని నేర ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. విదేశాలకు వెళ్లాలనే ఆశ, మంచి జీవితం కోసం చేసే ప్రయత్నాలను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. నకిలీ ఉద్యోగ ప్రకటనలు, సోషల్‌ మీడియా పరిచయాలు, పరిచయస్తుల ద్వారా వచ్చిన ఆఫర్లు వంటి మార్గాల్లో బాధితులను ఆకర్షిస్తున్నారు.

మంచి జీతంతో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి మయన్మార్‌ సరిహద్దు ప్రాంతాల్లోని సైబర్‌ మోస కేంద్రాలకు తరలించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అక్కడ బాధితులను బలవంతంగా ఆన్‌లైన్‌ మోసాలు చేయించే పరిస్థితులు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కొందరు బాధితులను భారత, అంతర్జాతీయ సంస్థల సహకారంతో రక్షించి స్వదేశానికి తీసుకొచ్చిన ఘటనలు నమోదయ్యాయి.

మరోవైపు మహిళలను కూడా ఇలాంటి ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. రెస్టారెంట్‌ ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు, ఉచిత ప్రయాణం వంటి హామీలతో కొందరు మహిళలను థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లి అక్రమ కార్యకలాపాల్లోకి నెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవడం, కుటుంబ సభ్యులకు చెబుతామని బెదిరించడం, భయపెట్టడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు కేసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విదేశీ ప్రయాణం కొత్త అవకాశాలకు మార్గం చూపొచ్చు.. కానీ సరైన సమాచారం లేకుండా, గుర్తింపు లేని వ్యక్తుల మాటలు నమ్మి అడుగు వేస్తే అదే ప్రయాణం ప్రమాదంగా మారే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే ముందు ఉద్యోగాలు, ట్రావెల్‌ ఆఫర్లు, ఏజెంట్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం, కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వడం అత్యంత అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement