లక్షన్నర మంది భారతీయులపై ప్రభావం
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులైన డ్రైవర్లలో గుబులు మొదలైంది. వారి స్థానంలో అమెరికన్ మాజీ సైనికులను నియమించాలన్న ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. వలసవచ్చి డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిలో చాలామంది మత్తుమందులు, మద్యం ప్రభావంతో అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు. వారివల్ల ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ డ్రైవర్లను తొలిగించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ వలసదారులకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.
వీరిలో వేలాది మంది ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ప్రవేశించారు. అమెరికాలో దాదాపు లక్షన్నర మంది భారతీయులు డ్రైవర్లుగా పని చేస్తున్నట్లు అంచనా. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హరియాణాకు చెందినవారే ఉన్నారు. తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన సైనిక పెట్టుబడుల సదస్సులో ట్రంప్ మాట్లాడారు. వలసదారులైన ట్రక్కు డ్రైవర్లపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వీరిలో చాలామంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినవారే కాకుండా, భారీ ట్రక్కులను నడపడానికి సరైన పత్రాలు, లైసెన్సులు వారివద్ద లేవని తెలిపారు. అలాంటి డ్రైవర్లు అమెరికాలో ఉండడంతమకు ఇష్టం లేదన్నారు. నిబంధనలు తెలియనివారిని, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని ఎలా భరించాలని ప్రశ్నించారు. విదేశీ డ్రైవర్ల స్థానంలో అమెరికా మాజీ సైనికులను నియమించాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు.


