బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekkar) తన 37వ పుట్టినరోజు (జూలై 18) సందర్భంగా గోవాలోని తన పూర్వీకుల గ్రామమైన పెడ్నేలోని 400 ఏళ్ల నాటి సుప్రసిద్ధ శ్రీదేవి మౌళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. తమ గ్రామంలోని మౌళి మాత కులదేవి అని స్వచ్ఛమైన మంచినీటి సెలయేటి పక్కన ఉన్న ఆమె పురాతన రాతి విగ్రహానికి ఔషధ గుణాలు ఉన్నాయని తెలిపింది.
‘‘నా వయసు మరో ఏడాది పెరిగింది. ఈ పుట్టినరోజును మా కులదేవి ఆశీస్సులతో ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈమె మా అందరి జీవితాల్లో ప్రేమను, ఐశ్వర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను." అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఆమెకు అభినందనలుతెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
మౌళి దేవి ఆలయ విశిష్టత
మాత మౌళి దేవి పెడ్నేకర్ వంశస్థులతో పాటు ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు కులదైవం.ఈమెను దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు.ఇక్కడి ఒక స్పటిక నిర్మలమైన నీటి ప్రవాహం (జలపాతం) పక్కన కనీసం 400 ఏళ్ల నాటి పురాతన రాతి విగ్రహం ఉంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికుల నమ్మకం. ఇదే కాంప్లెక్స్లో ఒక కొత్త ఆలయాన్ని కూడా నిర్మించారు.
ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!
ఈ ఆలయం నిర్మాణం ఇండో-పోర్చుగీస్ డిజైన్ శైలిని కలిగి ఉంటుంది. కొంకణ్ ప్రాంతానికి చెందిన అరుదైన ఎరుపు-గోధుమ రంగు క్లే ప్లాస్టర్ టెక్నిక్ అయిన 'కావి ఆర్ట్' (Kaavi art) తో ఇక్కడి గోడలను అలంకరించారు. ఇక్కడి మహిషాసుర మర్దిని శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ప్రాంగణంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొన్ని పురాతన విగ్రహాలు, నందితో కూడిన రామేశ్వర లింగం కూడా ఉన్నాయి. భగవతి దేవి ఆలయం, రావల్ నాథ్ ఆలయం కూడా ఇక్కడి ప్రత్యేకత. రావల్ నాథ్ స్వామిని ఆ గ్రామ రక్షకుడిగా, పెడ్నేకర్ వంశ సంరక్షకుడిగా భావిస్తారు. పెళ్లిళ్లు, కొత్త ఇళ్ల నిర్మాణం లేదా కొత్త పనులు ప్రారంభించే ముందు ఇక్కడ 'ప్రసాదం' అడిగి అనుమతి తీసుకునే ఆచారం ఉంది.
ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది


