విజయవాడపశ్చిమ, ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మహిళా సెక్యూరిటీ గార్డుపై వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సెక్యూరిటీ గార్డును అదే విభాగంలో విధులు నిర్వహిస్తున్న మరో గార్డు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు సెక్యూరిటీ సీఎస్వోకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు గత కొంత కాలంగా మహామండపం రెండో అంతస్తులోని అన్నదానం విభాగంలో భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటుంది. అయితే అదే ఫ్లోర్ ఇన్చార్జిగా ఉన్న సూపర్వైజర్ కిరణ్ అనే గార్డు కొంతకాలంగా ఆ మహిళా గార్డును వేధింపులకు గురి చేయసాగాడు. విధులు ముగిసిన అనంతరం మూడో అంతస్తులోని కార్యాలయానికి వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తానని బెదిరింపులకు దిగాడు. గతంలో దుర్గాఘాట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ కిరణ్ ఆ మహిళా గార్డును వేధింపులకు గురి చేయడమే కాకుండా వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడేవాడు.
అప్పట్లో సెక్యూరిటీ సూపర్వైజర్లు కిరణ్ను పిలిచి మందలించినా ప్రయోజనం లేకపోయింది. తాజా వేధింపులపై బాధితురాలు సెక్యూరిటీ అధికారికి ఫిర్యాదు చేసింది. ఆలయ అధికారుల సూచన మేరకు సీఎస్వో రూపేంద్రబాబు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సదరు ఫిర్యాదుపై సీఐ శుక్రవారం ఆలయానికి చేరుకుని మహా మండపం రెండో అంతస్తులో తోటి గార్డులతో పాటు సూపర్వైజర్లు, ఇతర సిబ్బందిని విచారించారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు సీరియస్గా తీసుకుని సదరు సూపర్వైజర్ కిరణ్ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.


