ఏఐ ఫోటో
విజయవాడ: విడాకుల కోసం కోర్టులో వేసి అధికంగా భరణం అడుగుతూ అత్తను వేధిస్తున్న కోడలిపై భవానీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు. నగరానికి చెందిన చింతపల్లి శ్రీదేవి కుమారుడు కేతన్కు కమల సాయిబాయి అనే యువతితో 2023లో వివాహమైంది. వివాహం తర్వాత శ్రీదేవి కుటుంబం చెన్నైకి వెళ్లిపోయింది. కేతన్తో భార్య కమల కొంత కాలం కాపురం చేసింది.
తర్వాత తాను చెన్నైలో ఉండలేనని విజయవాడలోని పుట్టింటికి వచ్చేసింది. కొద్ది రోజుల తర్వాత కోడలిని కాపురానికి తీసుకెళ్లేందుకు అత్త శ్రీదేవి, భర్త కేతన్ విజయవాడ వచ్చారు. కానీ ఆమె తనకు విడాకులు కావాలంటూ కోర్టులో విడాకుల కోసం కేసు వేసింది. ఎక్కువ మొత్తంలో భరణం ఇవ్వాలని కోరింది. అందుకు కేతన్ తల్లి శ్రీదేవి అంగీకరించకపోవడంతో కేసులు వేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో కోడలు కమల తనను వేధిస్తుందంటూ అత్త శ్రీదేవి భవానీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


