సాక్షి, తిరుమల: తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనకు గురిచేసింది. తాజాగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిరుతను చూసిన పలువురు భక్తులు భయంతో పరుగులు తీశారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. శబ్దాలు చేస్తూ చిరుతను నెమ్మదిగా అడవి ప్రాంతం వైపు తరిమారు. అనంతరం చిరుత అడవిలోకి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అలిపిరి నడక మార్గంలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఒంటరిగా కాకుండా గుంపులుగా మాత్రమే నడవాలని, రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తప్పనిసరిగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని సూచనలు చేశారు.
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,265 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.26 కోట్ల ఆదాయం లభించింది. టీటీడీ 4.09 లక్షల లడ్డూలను విక్రయించింది.


