సాగు ధ్రువీకరణ బాధ్యత రైతులకు అప్పగింత
అధికారుల ధ్రువీకరకణకు బదులుగా స్వీయప్రకటనకు అవకాశం
99 శాతం ఈ–పంట నమోదు చేస్తున్నామని ఓ వైపు గొప్పగా ప్రకటనలు
ఈ–పంట నమోదు చేస్తున్నప్పుడు స్వీయ ధ్రువీకరణ ఎందుకంటున్న రైతులు
బీమా క్లెయిమ్లపై అభ్యంతరాలు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్న
స్వచ్ఛంద నమోదు పంటల బీమా అమలు తీరుపై సర్వత్రా ఆందోళన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2026–27 వ్యవసాయ సీజన్లో అమలుచేస్తున్న స్వచ్ఛంద నమోదు పంటల బీమా పథకం అమలు తీరుపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఫార్మర్ ఐడీ తప్పనిసరి చేసిన ప్రభుత్వం తాజాగా పంటల సాగుకు సంబంధించి స్వీయధ్రువీకరణకు అవకాశం కల్పించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటల బీమా చేయించుకోవడంలో సమర్పించాల్సిన పత్రాల్లో ఏరియా సోన్ సర్టిఫికెట్ కీలకం. సర్వే నంబరు వారీగా ఎంత విస్తీర్ణంలో ఏ రైతు ఏ పంట సాగుచేస్తున్నారో నిర్ధారించే పత్రాన్నే ఏరియా సోన్ సర్టిఫికెట్ అంటారు.
ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్ను సంబంధిత గ్రామ వ్యవసాయ సిబ్బంది జారీ చేసేవారు. కానీ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఈ సర్టిఫికెట్ విషయంలో రైతులు స్వీయధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) చేస్తే సరిపోతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంట వివరాలను పూర్తిగా రైతులే ప్రకటించాల్సి రావడంతో, తర్వాత ఈ–పంట (డిజిటల్ క్రాప్ సర్వే) వివరాలతో వ్యత్యాసాలుంటే బీమా క్లెయిమ్లపై అభ్యంతరాలు తలెత్తే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం గడువు ముగిసిన తర్వాత అన్ని వివరాలతో ధ్రువీకరణ జరుగుతుందని పేర్కొంటున్నారు.
వివాదాలు తలెత్తితే..
రైతు సౌలభ్యం పేరుతో ఏరియా సోన్ సర్టిఫికెట్ జారీచేసే బాధ్యతను రైతులపైకి నెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు దాదాపు ప్రతి సీజన్లోను 99 శాతం మేర ఈ–పంట నమోదు చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఈ–పంట నమోదు విషయంలో స్వీయనమోదు పేరిట ప్రభుత్వం తమ బాధ్యతను తప్పించుకుంది. పంటల బీమా నమోదు విషయంలో ఏరియా సోన్ సర్టిఫికెట్ జారీ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొందన్న వాదన వినిపిస్తోంది. అధికారులు జారీ చేసే ధ్రువీకరణకు బదులుగా రైతు స్వీయప్రకటనను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వివాదాలు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ–పంటలో నమోదు చేసి లాభమేమిటి?
జియో రిఫరెన్స్ కో ఆర్డినేట్స్తో ఏ సర్వే నంబరులో ఎంత విస్తీర్ణంలో ఏ రైతు ఏ పంట సాగుచేస్తున్నారో ఈ–పంటలో నమోదు చేస్తారు. వెబ్ల్యాండ్ సీసీఆర్సీ, ఆర్వోఎఫ్ఆర్ డేటా బేస్ ఆధారంగా ఈ–పంట, డిజిటల్ క్రాప్ సర్వే వంటి వ్యవస్థల ద్వారా పంటల నమోదు చేస్తున్నప్పుడు పంటల సాగు విషయంలో స్వీయధ్రువీకరణ అవకాశం కల్పిస్తే ఇక ఈ–పంట నమోదుకు అర్థమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య డాక్యుమెంటేషన్ కాదు.. డేటా కచ్చితత్వం. గ్రామస్థాయిలో పంట, భూమి విస్తీర్ణం వివరాలు సమయానికి అప్డేట్ కాకపోతే బీమా నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
స్వీయధ్రువీకరణ తర్వాత అధికారులు సైతం ఈ–పంటలో నమోదు డేటాతో పాటు ఇతర డేటా బేస్లతో వెరిఫికేషన్ చేస్తారు. ఇన్ని దశల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా చివరకు ఆ ప్రభావం రైతులపై పడుతుంది. మరోవైపు తప్పుడు ధ్రువీకరణ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటన్నింటిని పరిశీలిస్తే రైతులకు నిజంగా బీమా ప్రయోజనం కల్పించే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టమవుతోంది.
వారికి ఏమాత్రం అవకాశం లేదు
వక్ఫ్బోర్డు, సొసైటీ, దేవదాయ, లంక, అటవీభూములు సాగుచేస్తున్న కౌలురైతులకు ఫసల్ బీమా పథకం వర్తించదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. పైగా ఫసల్ బీమాలో చేరాలంటే రైతులకు కచ్చితంగా విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) ఉండి తీరాలని స్పష్టం చేసింది. సొంత భూమి కలిగిన రైతులు విధిగా పొలం పాస్ పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్పుస్తకం జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నంబరును ప్రీమియం చెల్లింపుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వాతావరణ ఆధారిత పంటల బీమాకు ప్రీమియం చెల్లించేందుకు నాలుగు రోజుల్లో (ఈ నెల 15తో) గడువు ముగియనుండగా, వరియేతర పంటలకు జూలై 31వ తేదీతో గడువు ముగియనుంది. వరిపంటకు మాత్రం ఆగష్టు 15వ తేదీ వరకు గడువు ఉంది.


