ఓటర్ల అక్రమ నమోదును అడ్డుకోవడంతో ఘటన
కర్రలతో విరుచుకుపడిన టీడీపీ వర్గీయులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
కానిస్టేబుల్ ఫిర్యాదుతో బాధితునిపైనే కేసు నమోదు
సాక్షి టాస్క్ఫోర్స్: ఓటర్ల అక్రమ నమోదును అడ్డుకున్న వైఎస్సార్సీపీ బీఎల్ఏపై టీడీపీ వర్గీయులు సచివాలయంలోనే కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం మంచాలకట్ట గ్రామంలో జరిగింది.‘సర్’లో భాగంగా శుక్రవారం ఓటరు లిస్టును స్థానిక సచివాలయంలో పరిశీలిస్తుండగా అక్రమంగా ఓటర్లను నమోదు చేసుకునేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ బీఎల్ఏ వెంకటకృష్ణ అడ్డుకున్నాడు. మా ఓట్లనే అడ్డుకుంటావా, నీ అంతు తేలుస్తామని ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు సచివాలయం తలుపులు మూసి బీఎల్ఏ (బూత్ నెంబర్ 276) ఆవుల వెంకటక్రిష్ణపై కర్రలతో దాడి చేశారు.
తీవ్రగాయాలపాలైన బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గాయపడిన వెంకటకృష్ణపైనే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఇరువర్గాలు సచివాలయంలోనే గొడవపడినట్లు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏ1గా వెంకటకృష్ణపై కేసు నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. ఇదే సమయంలో బాధితుడి ఫిర్యాదును కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడమేంటని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మధుసూదన్ ప్రశ్నించారు. కాగా, టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వెంకటక్రిష్ణను వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని నంద్యాల ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.


