ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరిగిన భారీ డీల్ హాట్ టాపిక్గా నిలిచింది. ఆస్క్ (ASK) వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ డైరెక్టర్ భారత్ షా కుటుంబం ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్లీ ప్రాంతంలో నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'కల్పతరు వన్' (Kalpataru One) ప్రాజెక్ట్లో జరిగిన ఈ డీల్ మొత్తం విలువ దాదాపు రూ. 180 కోట్లు. రియల్ ఎస్టేట్ విక్రయాల వృద్ధి నెమ్మదించిందనే ఆందోళనలు ఉన్నప్పటికీ, ముంబై, ఢిల్లీ NCR వంటి ప్రధాన నగరాల్లోని లగ్జరీ ప్రాజెక్టులలో భారీ లావాదేవీలు,ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద నివాస ప్రాపర్టీ లావాదేవీలలో ఇది ఒకటిగా నిలిచింది.
రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'జాప్కీ' (Zapkey) సేకరించిన రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భరత్ షా భార్య ప్రీతి షా, కుమార్తె కిన్నారి షా లిస్టెడ్ డెవలపర్ కల్పతరు లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లోని 34వ, 35వ అంతస్తులలోని అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. రెరా (RERA) నిబంధనల ప్రకారం ఈ నాలుగు ఫ్లాట్ల మొత్తం కార్పెట్ ఏరియా 17,689 చదరపు అడుగులు (అంటే ఒక్కో అపార్ట్మెంట్ దాదాపు 4,422 చదరపు అడుగులు). చదరపు అడుగు ధర సుమారు రూ. 1.01 లక్షలుగా పలికింది.
రూ. 9 కోట్ల స్టాంప్ డ్యూటీ
మహిళల పేరిట ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1శాతం రాయితీ లభించినప్పటికీ, ఈ డీల్ కోసం రూ. 8.97 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ ఇళ్లతో పాటు 16 కార్ పార్కింగ్ స్లాట్లు కూడా కేటాయించబడ్డాయి. అంతేకాదు ఈ-క్లినికల్ వర్క్స్ (eClinicalWorks) సీఈఓ గిరీష్ నవాని భార్య రాధి నవాని, వర్లీ సీ ఫేస్లోని 'నమన్ క్షానా' ప్రాజెక్ట్లో ఒక అపార్ట్మెంట్ను రూ. 162 కోట్లకు కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!


