ఢిల్లీ: సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇవాళ(శుక్రవారం) కోర్టుకు హాజరైన ఓ పిటిషనర్ విచారణను అడ్డుకుని.. న్యాయమూర్తులను దూషించి.. కోర్టు రూంలోనే పత్రాలను విసిరివేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని జడ్జీలకు పిటిషనర్ ఆర్డర్ వేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో బలవంతంగా కోర్టు రూమ్ నుంచి పిటిషనర్ను పోలీసులు బయటకు పంపివేశారు.
జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం ఈ ఘటన జరిగింది. వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపించిన పిటిషనర్.. “మీరు జ్యుడీషియల్ సర్వెంట్. నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను… లక్నో ఏసీపీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించండి” అంటూ వాదనలు వినిపించారు. ఈ ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన జస్టిస్ విశ్వనాథన్.. “మీరు నన్ను ఆదేశిస్తున్నారా? మమ్మల్ని ఆదేశిస్తున్నారా?” అంటూ అశ్చర్య వ్యక్తం చేశారు. తన వైపు నుంచి అంతే.. అన్నీ రికార్డులో ఉన్నాయంటూ పిటిషనర్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో కేసు ఫైల్ను గాల్లోకి విసిరేసిన పిటిషనర్.. ఓపెన్ కోర్టులోనే దూషణలకు దిగాడు.
ఇంతటి కలకలం రేగినా.. ఆ పిటిషనర్పై కోర్టు ధిక్కార చర్యలు గానీ, మరే ఇతర చట్టపరమైన చర్యలు గానీ తీసుకోకూడదని ధర్మాసనం నిర్ణయించింది. "మేము అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేదు. కేసు మెరిట్స్ విషయానికి వస్తే.. మేము రికార్డులను పరిశీలించాము. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదు. అందువల్ల ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేస్తున్నాం" అని జస్టిస్ విశ్వనాథన్ ప్రకటించారు. జస్టిస్ విశ్వనాథన్ ఆ పిటిషనర్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. అతను తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు. అదంతా నిరాశ, నిస్పృహల వల్ల జరిగింది. అతనిపై మాకు సానుభూతి మాత్రమే ఉంది" అని పేర్కొన్నారు.


