సాక్షి, న్యూఢిల్లీ: చట్టబద్ధమైన వారసురాలైన భార్యను కాదని, ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తులకు ఆస్తిని రాసిస్తూ చేసే వీలునామాలను అసహజమైనవిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అనుమానాస్పద పరిస్థితుల మధ్య రాసిన వీలునామాలను కేవలం రిజి్రస్టేషన్ జరిగిందనో, సాక్షుల సంతకాలు ఉన్నాయనో ఆమోదించలేమని తేల్చిచెప్పింది. వీలునామా అసలైనదేనని నిరూపించి, కోర్టు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆస్తి లబ్ధిదారులపైనే ఉంటుందని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
సర్దారీ లాల్ వర్సెస్ బిషన్ దాస్ కేసులో అసలు ఆస్తి యజమాని చజ్జు రామ్ మరణానంతరం, ఆస్తికి తానే ఏకైక వారసురాలినని పేర్కొంటూ ఆయన భార్య భాంబో దేవి సివిల్ దావా వేశారు. అయితే, చజ్జు రామ్కు తాము సేవలు చేసినందుకు ప్రతిఫలంగా 1974లో ఆస్తి రాసిస్తూ రిజిస్టర్డ్ వీలునామా చేశారని ప్రతివాదులైన బిషన్ దాస్ తదితరులు కోర్టులో వాదించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీలునామా వెనుక భాగంలో సబ్– రిజిస్టర్ ధ్రువీకరణ వద్ద పేర్ల కొట్టివేతలు ఉన్నాయని, లబి్ధదారుల్లో ఒకరు అప్పటికి చిన్న పిల్లవాడని, భార్యను కాదని ఆస్తిని ఇతరులకు ఇవ్వడం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం వీలునామా చెల్లుబాటుపై కీలక వ్యాఖ్యలు చేసింది. క్లాస్–1 వారసురాలైన భార్యను పూర్తిగా పక్కనబెట్టి, ఎలాంటి రక్తసంబంధం లేని వ్యక్తులకు ఆస్తిని కట్టబెట్టడం సహజ విరుద్ధమని పేర్కొంది. ఇది వీలునామా విశ్వసనీయతపై తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది.
చదువుకోని వ్యక్తి రాసిన వీలునామా కావడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొట్టివేతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. వీలునామాపై అనుమానాలు ఉన్నప్పుడు, కేవలం దానికి సాక్షుల బలముందన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డిగా ఆమోదించరాదంది. ఆ అనుమానాలను నివృత్తి చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలోనే దానిని రాశారని న్యాయస్థానాన్ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత లబి్ధదారులదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు, మొదటి అప్పీలేట్ కోర్టులు దానిని కొట్టివేయగా.. సాక్షుల వాంగ్మూలం ఉన్నందున వీలునామాను సమరి్థస్తూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు నిచి్చంది. దీనిపై దాఖలైన అప్పీల్ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తన పరిధిని మించి వ్యవహరించిందని తప్పుబట్టింది.


