హరిపాడ్: ఉజ్బెకిస్తాన్లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని సవారియా తోటి విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఉజ్బెకిస్తాన్లో ఉంటున్న మలప్పురంలోని పెరింతల్మన్నకు చెందిన విద్యార్థి సధారుల్ అనామ్ను ఉజ్బెకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సవారియా, నిందితుడికి మధ్య నాలుగు రోజుల క్రితం ఒక చిన్న వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అనామ్.. సవారియా తలపై ల్యాప్టాప్తో బలంగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ సవారియా మృతి చెందింది.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఉజ్బెకిస్తాన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మంగళవారం నాటికి సవారియా మృతదేహం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ నుంచి కొచ్చి మీదుగా ఆమె స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కువైట్లో పనిచేస్తున్న సవారియా తండ్రికి అవసరమైన పత్రాలు లభించకపోవడంతో నేరుగా కేరళకు చేరుకోగా, ఆమె బాబాయ్ ఉజ్బెకిస్తాన్ వెళ్లి మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. మృతురాలికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నారు.
ఇది కూడా చదవండి: మూకాంబికా భక్తుల కోసం సురేష్ గోపి డిమాండ్


