మనకే ఈ కష్టాలు అనుకుంటాం. కానీ ఏ ఒక్కరిని పలకరించినా లేక మాటలు కలిపినా..మనమే నయం అనిపిస్తుంది, పైగా ధైర్యంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తాం కూడా. అలాంటి కన్నీటి కథే ఇది. ఒంటరిగా పోరాడుతూ అలిసిపోయినా ఓ రిటైర్డ్ మహిళా టీచర్ కన్నీటి వ్యథ. ఇంతటి స్థితిలో కూడా ఆశను వదులుకోనంటూ సరికొత్త జీవితానికి నాంది పలికి అండగా నిలిచే సంతోషాన్ని వెతుక్కుంటూ సాగిపోతోంది. నిజంగా ఆమె ధైర్యానికి మాటల్లేవ్ అంతే..!.
ఆ మహిళే హర్యానాకు చెందిన సునీతా చౌదరి తన కథను సోషల్ మీడియా వేదికగా పంచుకుందిలా. అందరి అమ్మాయిల్లానే 20 ఏళ్ల వయసులో మీరట్లో పెళ్లి చేసుకుంది. ఆమె భర్త ఒక న్యాయవాది. ఆయనొక స్కూల్ని కూడా నడిపేవారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సునీతా ఆ పాఠశాల్లోనే బోధించడం ప్రారంభించిది. చాలామంది అమ్మాయిల్లానే ఆమె కూడా తన భర్తతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంది.
కానీ కొన్నేళ్లకే ఊహించని విధంగా కష్టాలు ఒకదానివెంట ఒకటిగా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆమెకు అత్తమామల అండ లేకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంది. మొదటి గర్భధారణ సమయంలో ఎవ్వరి మద్దతు లభించలేదామెకు. ఆ పట్టణం కూడా కొత్త అవ్వడంతో ఎవ్వరిని సహాయం అడగాలో తెలియని స్థితి. సరిగ్గా ఆ సమయంలో ఉమ్మనీరు లీక్ అయ్యి..ఆస్పత్రిలో చేరేందుకు ఒంటరిగా వెళ్లిన ఘటన ఇప్పటికీ మర్చిపోనంటోందామె.
అక్కడ ఎవరో ఇద్దరు మహిళలు చూసి క్లినిక్ తీసుకువెళ్లారు..అక్కడ తనని పరీక్షించి సెలైన్ ఎక్కించారని, ఆ తర్వాత ఆ విషయాన్ని స్కూల్లో ఉన్న భర్తకు చేరవేశానని చెప్పుకొచ్చారు. ఆయన వచ్చి మెరుగైన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ మొదటి బిడ్డకు జన్మనిచ్చానని అన్నారు. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో సైతం తన పరిస్థితి బాగోలేదని ఆ సమయంలో తన భర్త రూర్కీలో ఉన్నారని తెలిపింది. అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆమె ముందుకు రాలేదని, తన మామగారే పక్కింటావిడిని పిలుచుకొచ్చారని చెప్పుకొచ్చింది.
సరిగ్గా తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రసవం జరిగిందని, ఆ తర్వాత ఏమైనా తిన్నవా అని అడిగేవారే లేరంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి ఉదయం 5 గంటలకు తనే లేచి పాలు కాసి పాల సీసాలో పోసి పెద్ద కొడుక్కి పట్టించానని ఆవేదనగా చెప్పింది. ఇక మూడో ప్రసవం సమయంలో అస్సలు మద్దతు లేదని, తన భర్త పక్కనే ఉన్నా..ఎన్ని పనులు అని చేయగలరని ఆక్రోశంగా చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా కాలం పాటు అనారోగ్యంతో బాధపడ్డానని, టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధుల అటాక్ అయ్యాయని, చూసుకునేవారు లేరని బాధగా తెలిపింది.
ఇంకోవైపు పుట్టిన పాప చాలా బలహీనంగా ఉండటంతో తీవ్రమైన కామెర్లతో బాధపడింది. దీనికి తోడు హర్ట్లో హోల్ ఉన్నట్లు వైద్యులు నిర్థారించడంతో పెద్దపీడుగు పడ్డట్లు అనిపించిందని తన బాధను ఏకరవు పెట్టింది. చివరికి ఏదోలా ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేయించాం కదా ఇక కష్టాలకు పులిస్టాప్ పడింది అనుకుంటే..విధి మరోలా తలిచింది. సరిగ్గా ఆ తర్వాత\భర్త అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. పైగా ఎలాంటి వైద్య బీమా లేకపోవడంతో పిల్లల చదువులు, ట్యూషన్లు, స్కూల్ వ్యవహారాలు తదితర ఇంటి బాధ్యతన్నీ తానే స్వయంగా చూసుకోక తప్పలేదు.
పోనీ భర్తకు ఆపరేషన్ చేయించి బతికుంచి కుంటే మరోసారి విధి కన్నెర్రజేసిందంటూ తన బాధన వివరించింది. ఈసారి యాక్సిడెంట్ రూపంలో వచ్చి..తన భర్తను మరోసారిఆస్పత్రి పాలయ్యేలా చేసింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. చివరిక ఆయన డయాలిసిస్పై ఆధారపడి జీవించాల్సి వచ్చింది. అంత కష్టంలోనూ అత్తమామల నుంచి ఎలాంటి సహయా సహకారాలు లభించలేదని వాపోయింది. ఆయన కోసం తన వల్ల అయ్యిందంతా చేసినా..చిరికి ఆయన 52 ఏళ్ల వయసులో తనను వదిలి వెళ్లిపోయారని బాధగా చెప్పింది.
ఆ తర్వాత కరోనా వచ్చి..ఇంట్లోనే బంధీగా మార్చింది. ఇక అప్పటికే శారీరకంగా, మానసికంగా అలిసిపోయాను, ఆర్థికంగా దెబ్బతిన్నాను. పోనీ మా వద్ద డబ్బు తీసుకున్నవాళ్లు సైతం మొండిచేయి చూపించారు. ఇక ఆ క్లిష్ట సమయంలో ఎందుకోసం బతకాలి ఏంటీ జీవితం..అని చాలా విరక్తిగా అనిపించింది. దాంతో జీవితాన్ని ముగించేద్దాం అనే కఠిన నిర్ణయం కూడా తీసుకున్నా. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె యూటర్న్ తీసుకుని.. ఉపాధ్యాయురాలిగా బోధించే వృత్తిలో ఉన్న నాకు బోధించడమే తెలుసు..ఓడిపోవడం కాదు అని తనకు తనే ధైర్యం చెప్పుకుంది.
తక్షణమే చనిపోయిన తన భర్త ఫోన్ని చేతికి తీసుకుని దీనిలోనే తన సంతోషాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఎలాగో లాక్డౌన్ కావడంతో..సోషల్ మీడియాలో రీల్స్ చేద్దాం అని డిసైడ్ అయ్యింది. అప్పటికీ ఆమెకు 60 ఏళ్లు టీచర్గా పదవీ విరణమ చేశారు కూడా. కానీ ఎలా మొదలుపెట్టాలి, ఏం చేయాలో తెలియలేదు. దాంతో తన కథనే సోషల్ మీడియాలో పంచుకోవడం మొదలు పెట్టింది. తన ఆవేదనను బంధువులు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోతేనేం..నెటిజన్ల మనసును తాకింది, అమితంగా ఆకర్షించింది కూడా.
వాళ్లంతా ఆమెను సూపర్ ఉమెన్ అంటూ మా సపోర్ట్ మీకే అమ్మ అన్న మాటలు ఆమెకు ఊపిరిపోశాయి. దాంతో మరిన్ని వీడియోలు నెట్టింట షేర్ చేయడం మొదలు పెట్టింది. ప్రతీదీ వైరల్ అవ్వడమే గాక సుమారు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఈ సోషల్ మీడియా తనకు ఎవ్వరూ లేరనే బాధ తీర్చి..,ఇంతమంది మద్దితిచ్చేలా ఓ పెద్ద కుటుంబాన్ని కానుకగా ఇచ్చిందని ఆనందంగా చెప్పుకొచ్చింది సునీతా.
కానీ భర్తను కోల్పోయిన బాధ మాత్రం తనను ఎప్పటికీ వీడదంటూ తన స్టోరీను ముగించింది. ఆమె కథ దుఃఖాన్ని శక్తిగా మార్చుకోవడం ఎలా అని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ. ఇలానే అందరి జీవితాల్లో కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి..ఎంత ధైర్యంగా ఫేస్ చేశామన్నదే ముఖ్యం కానీ..నాకే ఎందుకు అన్న ప్రశ్నకు తావివ్వకూడదనే సందేశాన్ని ఇస్తోంది కదూ..!.
(చదవండి: ఆ రోజు అమ్మ ఆభరణాలు అమ్మడం వల్లే.. ఇవాళ ఏకంగా రూ. 1.9 కోట్లు..)


