పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యోదంతం ప్రకంపనలు కొనసాగుతుండగానే మరో దారుణమైన ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన కేవలం మూడు నెలలకే ఒక 25 ఏళ్ల అంకిత్ తన ప్రేయసి సహాయంతో భార్యను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఆ తరువాత ఏమీ తెలియనట్టు నేపాల్కు పారిపోయారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలి తల్లి మనేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన 22 ఏళ్ల కుమార్తెకు ఫిబ్రవరిలో మనేసర్ నివాసి అంకిత్తో వివాహం జరిగిందని ఆమె పోలీసులకు తెలిపారు. మృతురాలు గత మే 21న అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికి, అత్తమామలను సంప్రదించినప్పటికీ సరైన సమాధానం లభించలేదు. దీంతో తమ కుమార్తె భర్త,అతని కుటుంబ సభ్యులపై అనుమానం రావడంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు.
దర్యాప్తులో భాగంగా, పోలీసులు మే 22న మనేసర్లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కాల్చి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితులైన భర్త ఏళ్ల అంకిత్, అతని ప్రేయసి, హర్యానాలోని ఝజ్జర్ జిల్లా నివాసి, 38 ఏళ్ల రజనీ దేవిలను అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం, అంకిత్ మనేసర్లో పొగాకు దుకాణం నడుపుతుండగా, రజనీ అదే ప్రాంతంలోని ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసేది.
మూడేళ్ల ప్రేమాయణం , హత్య
అంకిత్ ,రజనీ గత మూడేళ్లుగా రిలేషన్లో న్నట్టు పోలీసులు గుర్తించారు. భార్యను అడ్డు తొలగించేందుకు అంకిత్, తన భార్యను ఆ గదికి తీసుకెళ్లాడని, అక్కడ నిందితులిద్దరూ కలిసి ఆమెను కాల్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని ఘటనకు సుమారు రెండు నెలల ముందే ఉత్తరప్రదేశ్లో కొనుగోలు చేశారట.. కేవలం ఈ హత్యను చేసేందుకే ఆ ఆయుధాన్ని కొనుగోలు చేసి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా నేపాల్కు
పోలీసుల సమాచారం ప్రకారం, హత్య జరిగిన తర్వాత అంకిత్ , రజని హరిద్వార్కు పారిపోయి, ఆ తర్వాత నేపాల్ వెళ్లిపోయారు.జూన్ 30న తిరిగి భారతదేశానికి వచ్చే వరకు నిందితులు పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మనేసర్లో క్రైమ్ బ్రాంచ్ బృందం వారిని అరెస్టు చేసింది. ప్రస్తుతం కోర్టు వీరిద్దరికీ 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను విచారిస్తున్నామని, హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అదనపు ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’


