సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన కేసులో మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయడానికి చెన్నై పోలీసులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఆయన సోదరుడు అశోక్ కుమార్పై కేసు నమోదు చేశారు.
కాగా, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు పలు బృందాలు రంగంలోకి దిగినట్టు ఇళయరాజ అనే ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో గురువారం మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఓ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ఉన్నారు. కొందరు టీవీకే ఎమ్మెల్యేలకు రూ. 35 కోట్లు, మరికొందరికి రూ. 50 కోట్ల మేరకు ఆఫర్ ఇవ్వడం, బెదిరింపులకు కూడా పాల్పడినట్టు చెన్నై పోలీసుల విచారణలో తేలింది.
పట్టుబడ్డ వారు ఇచ్చిన సమాచారంతో మాజీ మంత్రి , డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్కుమార్పై పోలీసులు దృష్టి సారించారు. అశోక్కుమార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. సెంథిల్ బాలాజీని సైతం ఈ కేసు పరిధిలోకి తెచ్చి, ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ అన్నదమ్ముల కోసం కరూర్, కోయంబత్తూరులో పోలీసులు గాలిస్తున్నారు.


