శాసనసభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
మెగా డీఎస్సీలో అక్రమాలు జరగలేదు
అవినీతి జరిగిందని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు
సాక్షి, అమరావతి: ‘మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదు. అయినా డీఎస్సీపై ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల ఫేక్ జెన్జీ వ్యక్తులతో ధర్నాలు చేయించారు..’ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియ వివరాలన్నీ పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచినా వైఎస్సార్సీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ 14 డీఎస్సీలు జరిగితే టీడీపీ, ఎన్డీఏ హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. 2019–24 మధ్య 10–12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లకు రావటం మానేశారని, అందుకే తల్లికి వందనం అమలు చేశామన్నారు.ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా 2019–24 మధ్య పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారని విమర్శించారు.
ఓ మాజీ ఐఏఎస్, మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు..
తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని, కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టామన్నారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామని తెలిపారు. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను పారదర్శకంగా విడుదల చేసి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేశామన్నారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఏఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు వందల కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని, అధికారికంగా వివరణ ఇచ్చినా రోజుకో కుట్ర చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారని విమర్శలు చేశారు.


