సాలూరు రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోవడంతో అదే పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పెద్దవీధికి చెందిన తుపాకుల అరుణ్ తేజ్ (15) దుర్మరణం చెందాడు. మరో విద్యార్థి సుమన్ అశ్విన్ స్వల్పంగా గాయపడ్డాడు. సోమవారం మధ్యాహ్న భోజనానంతరం కాలకృత్యాలు తీర్చుకోవడానికి తోటి విద్యార్థులతో కలిసి అరుణ్తేజ్, అశ్విన్లు పాఠశాల వెనుక ఉన్న ప్రహరీ పక్కకు వెళ్లారు.
గోడ పూర్తిగా నానిపోయి ఉండడంతో అది కూలిపోయింది. అరుణ్తేజ్పై ప్రహరీ పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సుమన్, అశ్విని కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం వల్లే ఆరుబయటకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, మంత్రి సంధ్యారాణి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు అందజేస్తామని ప్రకటించారు.


