సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలు పాటించాలి
కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి బెంగళూరు: అసలే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న కర్ణాటకకు మరో షాక్ తగిలింది. తమిళనాడుకు నీటిని వదలాలని, ఈ మేరకు కావేరి నీటి నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఆర్సీ) ఆదేశాలను పాటించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి రోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించాలని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా ప్రస్తుత స్థితిగతులపై నివేదిక సమర్పించాలని కూడా సూచన చేసింది.
కొంత సమయం పడుతుంది : కర్ణాటక
కర్ణాటక నుంచి ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ సూచించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తమిళనాడు తీసుకొచి్చంది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను కర్ణాటక పూర్తిగా పాటించడం లేదని ఆరోపించింది. దీనిపై బిళిగుండ్లు వద్ద నీటి పరిమాణం బాగా తగ్గిపోయిందని, తమిళనాడు కోరుతున్నట్లు 12 వేల క్యూసెక్కులు విడుదల చేసేందుకు కొంత సమయం పడుతుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
కావేరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేక, రిజర్వాయర్లలో ఆశించిన మేర నీటి నిల్వలు లేవని పేర్కొంది. అయినా సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీడబ్ల్యూఆర్సీ ఆదేశాల మేరకు ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.


