కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్‌.. విజయ్‌కు గుడ్‌న్యూస్‌ | Supreme Court Orders Karnataka Release of Cauvery Water to Tamil Nadu | Sakshi
Sakshi News home page

కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్‌.. విజయ్‌కు గుడ్‌న్యూస్‌

Aug 17 2026 1:17 PM | Updated on Aug 17 2026 1:25 PM

Supreme Court Orders Karnataka Release of Cauvery Water to Tamil Nadu

ఢిల్లీ: కావేరి జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు 12 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినట్లు సమాచారం.

కావేరి నీటి విడుదలపై కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నీటి లభ్యత, రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై కర్ణాటక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. కావేరి అథారిటీ నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

అసలు కథ ఇదే.. 
కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం ముదిరింది. సుప్రీంకోర్టు తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక అమలు చేయాలని స్పష్టం చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు కావేరి నీటి విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంతటి వివాదం ఎందుకు? ఈ నీటి పంచాయితీ ఎక్కడ మొదలైంది?..

బ్రిటిష్‌ కాలం నుంచే వివాదం.. 
కావేరి నది కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో పుట్టి.. కర్ణాటక, తమిళనాడు మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై ఆధారపడి రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో కావేరి నీటి పంపకం రెండు రాష్ట్రాలకూ అత్యంత కీలకంగా మారింది. కావేరి నీటి పంపకంపై కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. బ్రిటిష్‌ కాలం నాటి 1892, 1924 ఒప్పందాల నుంచే నీటి వినియోగంపై విభేదాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న కర్ణాటకలో కొత్త ప్రాజెక్టులు, సాగు విస్తరణతో దిగువన ఉన్న తమిళనాడుకు నీటి లభ్యత తగ్గుతోందని ఆ రాష్ట్రం చాలాకాలంగా వాదిస్తోంది.

1986లో తమిళనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో వివాదం అధికారికంగా అంతర్రాష్ట్ర జల వివాదంగా ముందుకు వచ్చింది. 1990లో కావేరి జల వివాదాల ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. 2007లో ట్రైబ్యునల్‌ తుది తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కూడా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి మధ్య నీటి పంపకంపై న్యాయపోరాటం కొనసాగింది. 2018లో సుప్రీంకోర్టు ట్రైబ్యునల్‌ అవార్డులో కొన్ని మార్పులు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. అనంతరం కేంద్రం కావేరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, సంబంధిత వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కావేరి నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సంస్థలు కీలకంగా మారాయి.

కర్ణాటక అభ్యంతరం.. 
అయితే కావేరి నీటి పంపకం వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో వర్షాలు తక్కువగా ఉండి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు తమిళనాడుకు నీటిని విడుదల చేయడం తమ రైతులకు ఇబ్బందిగా మారుతుందని కర్ణాటక చెబుతోంది. మరోవైపు కావేరి డెల్టాలో పంటలకు నీరు అవసరమని, తమకు కేటాయించిన వాటాను కర్ణాటక విడుదల చేయాల్సిందేనని తమిళనాడు వాదిస్తోంది. తాజా వివాదంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కావేరి వివాదం కేవలం నీటి పంపకానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. రెండు రాష్ట్రాల రైతుల జీవనాధారం, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయాలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి. కర్ణాటకలో నీరు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగితే.. తమిళనాడులో తమకు రావాల్సిన నీటిని కర్ణాటక అడ్డుకుంటోందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకే ప్రతి ఏడాది వర్షాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, పంటల అవసరాలు మారినప్పుడల్లా కావేరి వివాదం మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి నీటి పంచాయితీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement