టెక్ వ్యవస్థాపకుడు, దీర్ఘాయువు నిపుణుడు బ్రయాన్ జాన్సన్ ఆరోగ్యకరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. ఈసారి మాత్రం ఆయన చెప్పిన విషయం అందర్నీ విస్తుపోయేలా చేసింది. పైగా అవి కాస్త సర్వత్రా వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..
బ్రయాన్ జాన్సన్ మంచి నిద్ర కోసం దంపతులకు కొన్ని ఆసక్తికరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే ఇక్కడ దంపతులు ఎలా బెడ్ షేర్ చేసుకుంటే మంచిదో చెప్పడమే కాస్త చర్చలకు దారితీసింది. వేర్వేరు పడకలు అనేవి భార్యభర్త మధ్య దూరానికి సంకేతంగా చెబుతారు పెద్దలు.
కానీ బ్రయాన్ మాత్రం ఆరోగ్యకరమైన నిద్ర కోసం భాగస్వామ్యులు వేర్వేరుగా పడుకుంటేనే మంచిదని బాంబు పేల్చాడు. అంతేగాదు తాను సైతం తన గర్ల్ఫ్రెండ్తో కలిసి నిద్రించనని తేల్చి చెప్పేశాడు. అది నిద్రనాణ్యతను ప్రభావితం చేస్తుందని చెబుతున్నాడు. నిజంగా జంటలు కలిసి నిద్రిస్తే..నిద్ర నాణ్యతపై ఎలాంటి ప్రభావవం చూపుతుంది అనే పరిశోధనను కూడా పంచుకున్నారు. మొత్తం 52 జంటలపై జరిపిన అధ్యయనంలో భాగస్వామి ప్రేరేపితంగా ఒక రాత్రికి సుమారు ఆరుసార్లుకు పైగా పలువురు మెలుకువగా ఉన్నట్ల జాన్సన్ చెబుతున్నారు.
అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాబిప్రాయాలు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పరిశోధన ప్రకారం..కలిసి నిద్రపోవడం వల్ల సుమారు 10% ఎక్కువ REM (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్) నిద్ర సరిగా లేదని తేలింది. ముఖ్యంగా భాగస్వామితో కలిసి పడుకుంటే మహిళల నిద్ర గణనీయంగా క్షీణిస్తున్నట్లు గమనించారు. అయితే పురుషులు బాగా నిద్రపోతున్నట్లు తెలిపారు జాన్సన్. అదే సమయంలో కలిసి నిద్రపోతున్న వెయ్యి వయోజన జంటలపై జరిపిన సర్వేలో చాలామంది బాగా నిద్రపోవడమే గాక, వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు.
ఈ నివేదిక ఆధారంగా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న జంటలు బెడ్ షేర్ చేసుకోవడంలో సమస్య ఉండదని వెల్లడైందని అన్నారు. చివరగా ఆయన జంటలు కలిసి నిద్రపోవాలా లేక వేర్వేరుగా నిద్రపోవాలా అనేది ఆయా జంటల వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. అయితే ఆయన వివరణ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. కొందరు ఆయన మాటలకు మద్దతించగా, మరికొందరు మంచి నిద్ర మిమ్మల్ని మంచి భాగస్వాములుగా చేస్తుందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!)


