బెంగుళూరు: బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గౌరవ్ సేన్ రోడ్లపై ఉన్న గుంతలను గుర్తించి, వాటికి బాధ్యులైనవారి వివరాలను కేవలం 4 సెకన్లలో వెలికితీసే వినూత్న ఏఐ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. అస్తవ్యస్త రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు పడే ఇబ్బందులను గమనించిన ఆయన, ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారం కనుగొన్నారు. ఈ నూతన వ్యవస్థలో భాగంగా ఆయన కార్లలో డాష్క్యామ్, జీపీఎస్, యాక్సిలరోమీటర్లను అమర్చారు. వాహనం కదులుతున్నప్పుడు ఓపెన్ఏఐ విజన్ మోడల్ సహాయంతో ఈ సిస్టమ్ వివిధ పరిమాణాల్లో ఉన్న గుంతలను గుర్తిస్తుంది. సాధారణ స్పీడ్ బ్రేకర్లకు, ప్రమాదకర గుంతలకు మధ్య తేడాను స్పష్టంగా అంచనా వేస్తుంది.
గుంతలను గుర్తించిన తర్వాత, ఈ వ్యవస్థ దాదాపు 2,900 ప్రభుత్వ కాంట్రాక్టుల డేటాబేస్తో అనుసంధానం అవుతుంది. దీనివల్ల ఆ నిర్దిష్ట రోడ్డు నిర్మాణానికి బాధ్యత వహించిన కాంట్రాక్టర్, సంబంధిత అధికార పేరు ఇట్టే బయటపడతాయి. రోడ్డు గ్యారెంటీ కాలపరిమితిలో ఉంటే, ప్రభుత్వ ఖర్చు లేకుండా కాంట్రాక్టరే దానిని బాగుచేయాల్సి ఉంటుంది.కేవలం 4 సెకన్లలో గుంత ఫోటో, కచ్చితమైన లొకేషన్, టెండర్ నంబర్, అధికారుల వివరాలతో కూడిన పూర్తి నివేదికను ఈ యాప్ సిద్ధం చేస్తుంది. ఆఫీసుకు వెళ్లే దారిలో ఈ వ్యవస్థను పరీక్షించిన ఇంజనీర్, ప్రయాణంలో 12 గుంతలను గుర్తించి నివేదికను రూపొందించారు. కాంట్రాక్టర్ల బాధ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వ విభాగాలు ఈ సాంకేతికతను ఉపయోగించాలని ఆయన కోరుతున్నారు.


