హర్దోయి: ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో దంపతుల మధ్య చోటుచేసుకున్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. భర్త తనపై దాడి చేసి, ముక్కును కొరికాడని ఓ మహిళ ఆరోపించగా.. ఆమె అత్త మాత్రం కోడలు తన కుమారుని ప్రైవేట్ పార్ట్ను కొరికిందని ప్రత్యారోపణ చేసింది. ఇరువర్గాల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్దోయి జిల్లా సాండీ పోలీస్స్టేషన్ పరిధిలోని ముంషీగంజ్ ప్రాంతానికి చెందిన సాధన (27) సుమారు మూడు నెలల క్రితం ఓ వ్యక్తితో కలిసి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో ఇరువర్గాల మధ్య పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిందని ఆమె అత్త పేర్కొంది. అనంతరం సాధన తిరిగి గురువారం ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ వివాదం మొదలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో తన భర్త దీపక్ తనపై దాడి చేసి, తన ముక్కును కొరికేసి, దానిని కాలువలో పడేశాడని తెలిపింది. ఘటన సమయంలో తన అత్తమామలు తన చేతులు పట్టుకున్నారని కూడా ఆమె ఆరోపించింది. గాయపడిన ఆమెను తొలుత సాండీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా, అక్కడి నుంచి హర్దోయి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
సాండీ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. వివాదం సమయంలో భర్త భార్యతో గొడవపడి ఆమె ముక్కును కొరికినట్లు ఆరోపణ వచ్చిందన్నారు. గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భర్త దీపక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సాధన అత్త తన కోడలిపై పలు ఆరోపణలు చేసింది. రెండున్నర నెలల క్రితం సాధన తమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వెళ్లిపోయిందని, అయితే పోలీసుల సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిన తర్వాత కూడా సాధన తిరిగి ఆ యువకుడితో వెళ్లిపోయిందని తెలిపింది.
ఇప్పుడు సాధన తిరిగి వచ్చి తన పిల్లలను కూడా వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వివాదం తలెత్తిందని అత్త తెలిపింది. ఈ క్రమంలో సాధన తన కుమారుడి ప్రైవేట్ భాగాన్ని కొరికిందని ఆమె ఆరోపించింది. అనంతరం సాధన స్వయంగా తనకు తాను గాయపర్చుకుందని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధనకు పదేళ్ల క్రితం దీపక్తో వివాహం జరిగింది. దీపక్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
ఇదీ చదవండి: నిమజ్జనం వేళ.. చిరాగ్ పాశ్వాన్ కన్నీరు!


