సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నిశితంగా అంచనా వేస్తున్నానని తెలిపారు. ఇదే సమయంలో తాను కోర్టుకు వెళ్లబోనని దానం కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా చిట్చాట్లో భాగంగా దానం నాగేందర్ మాట్లాడుతూ..‘ఉప ఎన్నిక వస్తే నేను కొట్లాడుతాను. నేను కోర్టుకు వెళ్ళను. కోర్టు ఆర్డర్ కాపీని చదువుతున్నాను. నేను పోరాటం చేయడానికి రెడీగా ఉన్నా. సమయం వచ్చినప్పుడు మీడియా ముందుకు వస్తాను. ప్రస్తుతం అన్ని రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నానని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని’ అన్నారు.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయనతో పాటు అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. తీర్పు వచ్చేటప్పటికే అసెంబ్లీ నుంచి ఇంటికి వచ్చిన దానం రెండు గంటల పాటు లోపలే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయనను కలిశారు. మరోవైపు దానం నివాసానికి నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్దగా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇక దానం అనర్హతపై బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చారు. బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.
కాంగ్రెస్లోని కొందరు సైతం ఆనందంగా కనిపించారు. కాగా, ఇటీవల ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్న దానం.. అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించడం లేదని, తన నియోజకవర్గంలో అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దానం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరేదాకా ఆ విషయం చాలామంది కార్యకర్తలకు తెలియదు. అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆయనతో వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వస్తే ఎందరు అండగా నిలుస్తారనేది చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: జన్వాడలో హైటెన్షన్.. కేటీఆర్ ఫామ్హౌస్ పరిశీలనకు కాంగ్రెస్ బృందం!


