ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ప్రశ్నించడం ఒక బాధ్యత.. అధికారంలోకి వచ్చాక అదే ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం మరో బాధ్యత. ఆ మధ్య రాఘవ్ చద్దా నీట్ నిరసనలపై మౌనంగా ఉండడంపై చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తానిప్పుడు అధికార పార్టీలో భాగమని.. ప్రశ్నించే స్థానంలో లేనంటూ వ్యాఖ్యానించారాయన. ఇప్పుడు కేంద్ర మంత్రి, గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తీరు కూడా అలాగే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోడ్డు సమస్యపై ఓటర్ నిలదీయగా.. కాస్త కోపం.. కాస్త ఆవేశంగా ఆయన స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని గుణలో సెప్టెంబర్ 18న ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు హనుమాన్ ఆలయం వద్ద సింధియా వాహనాన్ని ఆపి రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు నిర్మించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి.. రోడ్డు వేయకపోతే వచ్చేసారి ఎన్నికల్లో మీకు ఓటు వేయబోమని చెప్పాడు.
దీనిపై సింధియా స్పందిస్తూ.. “ఈ భాష నా ముందు ఉపయోగించొద్దు.. ఊరుకుంటా అనుకుంటున్నారా’’ అంటూ కటువుగా బదులిచ్చారు. ఆ తర్వాత కాస్త శాంతించి.. మీరు వచ్చి వినతిపత్రం ఇవ్వండి.. నా బాధ్యత, అన్నీ జరుగుతాయి అని చెప్పారు. సదరు వ్యక్తికి వేలు చూపిస్తూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Janta bhi matlab ek dum bewakoof hai.
Raja sahab ne election time me khud ko "jan-sevak" aur tumhe "janta-janardan" kya bol diya, tum to khud ko relevant samajh kar accountability maangne lage.
Hadd me raho bhai. Charno me let kar nivedan karna seekho. pic.twitter.com/gjonJQJ5Qq— THE SKIN DOCTOR (@theskindoctor13) September 18, 2026
మరోవైపు, గుణ పర్యటనలోనే సింధియా అధికారుల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలతో ఎదురుచూస్తుండగా కారు వద్ద ఉన్న కలెక్టర్, ఎస్పీలను పిలిపించి.. “వాహనంలో కూర్చోవద్దు.. మీరు నా డ్యూటీలో ఉన్నారు” అంటూ ఆదేశించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.
సింధియా స్పందనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా గతంలో కాంగ్రెస్లో ఉండి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. యువత పన్నులు చెల్లించాలని, బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని తరచూ సూచించే ఆయన.. తాజాగా రోడ్డు సమస్యపై ఓ పౌరుడు, రోడ్డు నిర్మించకపోతే ఓటు వేయబోమని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్పందిస్తున్న కొందరు.. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల కింద ఉండే ప్రజలు కాదని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాల్సిన వారని గుర్తు చేస్తున్నారు. రాచరిక కాలం ముగిసి దశాబ్దాలు గడిచాయని, ప్రజలే అసలైన యజమానులనే విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలని సింధియాకు చురకలంటిస్తున్నారు.
ఇదీ చదవండి: మోదీ 76.. ఆయనకు కూడా 76!


