కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు? | Radha Ashtami vrat katha special story | Sakshi
Sakshi News home page

కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు?

Sep 19 2026 9:57 AM | Updated on Sep 19 2026 9:57 AM

Radha Ashtami vrat katha special story

శ్రీకృష్ణుడి జన్మాష్టమి గురించి మనందరికీ తెలిసిందే. అయితే శ్రీకృష్ణుడికి ప్రియమైన రాధారాణి ప్రకటిత దినమైన రాధా అష్టమి గురించి ఎంతమందికి తెలుసు? భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి తిథిన రాధా అష్టమిని జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని రాధారాణి ప్రకటిత ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది రాధా అష్టమిని నేడు (శనివారం) భక్తిశ్రద్ధలతో పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. రాధారాణి, శ్రీకృష్ణులను పూజించడంతో పాటు ఈ రోజున వ్రత కథను చదవడం లేదా వినడం విశేష ఫలితాలను అందిస్తుందని భక్తులు నమ్ముతారు.

అసలు రాధారాణి భూమిపైకి ఎలా వచ్చారు?
పౌరాణిక కథనం ప్రకారం.. రాధారాణి గోలోక ధామంలో శ్రీకృష్ణుడికి ప్రియమైన శక్తిగా, మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఒకసారి గోలోకంలో రాధారాణికి శ్రీదాముడనే రాక్షసునికి మధ్య యుద్ధం జరగడంతో.. శ్రీదాముడు ఆమెను భూమిపై జన్మించమని శపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనికి ప్రతిగా రాధాదేవి కూడా శ్రీదాముడిని శంఖచూడుడనే రాక్షసుడిగా జన్మించమని శపించినట్లు చెబుతారు. ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన సమయంలో మహాలక్ష్మి రాధారాణి రూపంలో భూమిపై ప్రకటితం కావాలని నిర్ణయించుకున్నట్లు పౌరాణిక కథ చెబుతోంది. బ్రజ్ రాజు వృషభాను యజ్ఞం కోసం స్థలాన్ని శుభ్రం చేస్తుండగా యమునా నది ఒడ్డున బంగారు కమలంపై ఓ బాలిక కనిపించిందని, ఆమెను ఇంటికి తీసుకెళ్లి తన కుమార్తెగా పెంచుకున్నారని కథనం. ఆమెనే రాధారాణిగా భావిస్తారు.

రాధారాణి కళ్లు ఎప్పుడు తెరిచారు? పూజ ఎలా చేయాలి?
రాధారాణి జన్మించినప్పుడు ఆమె కళ్లు మూసుకుని ఉన్నాయని పౌరాణిక కథనం చెబుతోంది. బాలకృష్ణుడు ఆమె ఊయల వద్దకు వచ్చి పాదాలను తాకినప్పుడు రాధారాణి కళ్లు తెరిచి తొలిసారిగా తన ఆరాధ్యుడైన శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారని నమ్ముతారు. రాధా అష్టమి రోజున ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి. పూజా పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రం పరిచి, రాధా–కృష్ణుల విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. రాధారాణికి పంచామృతంతో అభిషేకం చేసి కొత్త వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించాలి. అనంతరం రాధా అష్టమి వ్రత కథను చదవడం లేదా వినడం చేయాలి. చివరగా హారతిని అందించాలి. ఈ కథను వినడం వల్ల భక్తి భావం పెరిగి, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని భక్తుల నమ్మకం.

ఇదీ చదవండి: పరీక్షలో చాట్‌జీపీటీ వాడి?.. హాస్టల్‌ గదిలో విగతజీవిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement