ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
కడప అర్బన్: క్షుద్ర పూజలకు అడ్డుపడుతున్నాడనే వల్లూరులో బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నానికి నిందితులు ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నం కేసులో నిందితులు విజయ్కుమార్, హేమంత్, సుబ్రహ్మణ్యంను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి కారు, వేటకత్తిని స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు ఆశ చూపి బాలికతో నగ్న పూజలు
చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన కాణిపాకం విజయ్కుమార్ అలియాస్ విజయ్, చిత్తూరు టౌన్ దుర్గానగర్కు చెందిన కర్ణం బాల హేమనాథ్ అలియాస్ హేమంత్, అదే ప్రాంతానికి చెందిన కర్ణం హేమనాథ్ బాల సుబ్రహ్మణ్యం ఒక ముఠాగా ఏర్పడ్డారు. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేయాలని నిర్ణయించారు. వీరు అనంతపురం జిల్లా శెట్టూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక తండ్రితో పరిచయం చేసుకుని డబ్బు ఆశ చూపి నగ్న క్షుద్ర పూజలు నిర్వహించారు.
అనంతరం గుప్తనిధుల విషయమై కడపకు చెందిన వెంకటేష్ యాదవ్ను సంప్రదించగా, మరోసారి పూజలు చేయాలని బాలికను కడపకు తీసుకురావాలని సూచించాడు. బాలికను, ఆమె తల్లిని వల్లూరులోని విజయ్కుమార్ స్నేహితురాలు భాగ్యలక్ష్మి ఇంటికి తీసుకెళ్లారు. అయితే భాగ్యలక్ష్మి కొడుకు నాగ సాయి ప్రణయ్కు వీరిపై అనుమానం వచ్చింది. వారి గురించి ఆరా తీశాడు.
దీంతో క్షుద్రపూజలకు ప్రణయ్ అడ్డుగా ఉన్నాడని నిందితులు అతడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో హతమార్చేందుకు దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.


