సాక్షి, శ్రీ సత్యసాయి: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం హిందూపురం నంది సర్కిల్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆమె జెండా ఎగురవేశారు. అయితే వసుంధరకు ప్రొటోకాల్ మర్యాదలు కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యం, శస్త్రచికిత్స కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని వసుంధర తెలిపారు. ఆయన తరఫునే తాను కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. అయితే ఎలాంటి అధికారిక పదవి లేని వ్యక్తికి అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్ కల్పించడం, అధికారులు–పోలీసులు గౌరవాలు ఇవ్వడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
పదవి లేకుండానే ప్రొటోకాల్ ఎందుకు? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికారిక కార్యక్రమాల నిర్వహణలో నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం హిందూపురం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


