సాక్షి, ముంబై: పుణే కోట హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కఠిన చర్యలు తీసుకుంది. పుణేలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఆమె తండ్రి ప్రవీణ్ గోయల్కు చెందిన మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ షాప్ను అధికారులు మూసివేశారు.
గోయల్ కుటుంబానికి చెందినలైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న ('M/s BG గోయల్ & కంపెనీ) అనే షాప్ నుండి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందుకు గాను దాదాపు రూ. 8.14 లక్షల విలువైన 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు జప్తు చేశారు. నాసిరకం ఉత్పత్తులు, సరైన లేబెల్లింగ్ లేకపోవడం మరియు కల్తీ జరిగినట్లు అనుమానించబడిన ఆహార పదార్థాలను దుకాణంలో గుర్తించారు. ఈ సందర్బంగా అధికారులు నాలుగు శాంపిల్స్ను ('సంత్', 'సాధు' బ్రాండ్ పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్) ల్యాబ్ పరీక్ష నిమిత్తం ల్యాబోరేటరీకి పంపారు. నివేదికలు వచ్చే వరకు షాప్ను మూసివేయాలని ఆదేశించారు. అలాగే వ్యాపారానికి సంబంధించి ఒక చిరునామాపై లైసెన్స్ తీసుకొని, మరొక ప్రదేశంలో నిల్వ చేయడం, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు FDA జాయింట్ కమిషనర్ దిగంబర్ భోగవాడే తెలిపారు.
ఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు
ల్యాబ్ నివేదికలలో కల్తీ రుజువైతే, ప్రవీణ్ గోయల్పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నారు. నేరం తీవ్రతను బట్టి రూ.5 లక్షల జరిమానా నుండి తీవ్రమైన సందర్భాల్లో జీవిత ఖైదు వరకు విధించే అవకాశముంది.
FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న "సేఫ్ ఫుడ్, సేఫ్ డ్రగ్, సేఫ్ మహారాష్ట్ర" ప్రచారంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. పుణే డివిజన్లో ఇప్పటివరకు 12 ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు రూ. 41 లక్షలకు పైగా విలువైన నిషేధిత ఉత్పత్తులను జప్తు చేశారు.
కాగా కాబోయే భర్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ ,ఆమె సహ నిందితుడు చేతన్ చౌదరి యెరవాడ సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు.
ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్


