ఢిల్లీ: ఎర్రకోటలో జరుగుతున్న 80 వ స్వాతంత్ర్య వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం గైర్హాజరైంది.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో ఏడాది ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు.
2024లో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై వివాదం చెలరేగింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా, కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ.. కార్యక్రమంలో రెండో చివరి వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది అప్పట్లో సంప్రదాయం, ప్రొటోకాల్కు భిన్నంగా ఉందంటూ చర్చకు దారితీసింది.
రాహుల్ గాంధీకి వెనుక వరుసలో సీటు కేటాయించడం కాంగ్రెస్ ఎంపీని మాత్రమే కాకుండా ప్రజలను అవమానించడమేనని ప్రతిపక్షం విమర్శించింది. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఒలింపియన్లకు వేదికపై చోటు కల్పించాల్సి రావడంతో సీట్ల కేటాయింపులో మార్పులు చేసినట్లు వివరణ ఇచ్చింది.
ప్రొటోకాల్ ప్రకారం అధికారిక, ఆచారబద్ధమైన కార్యక్రమాల్లో లోక్సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది కూడా ఖర్గే, రాహుల్ గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గైర్హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గైర్హాజరుపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
కాగా దేశవ్యాప్తంగాభారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ‘వందే మాతరం’ 150 ఏళ్ల వార్షికోత్సవం, అలాగే ‘యువ శక్తి–వికసిత్ భారత్@2047’ ప్రధాన అంశాలుగా వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటలో వేడుకలకు సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నట్లు సమాచారం.


