న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా చిల్లర వ్యాఖ్యలంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి నుండి అటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని రాహుల్ దెబ్బతీస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య చర్యకు ముప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నిన్న ప్రధాని నరేంద్ర మోదీపై, భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నీచమైనవి, ఖండించదగినవి. ఇది వ్యక్తిగతంగా నాకు కూడా బాధ కలిగిస్తోంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ప్రతిపక్ష నాయకుడి నుండీ ఇంతటి అసభ్యకరమైన, ఊహించలేని ప్రవర్తనను నేను ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ప్రవర్తన ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లడానికి తీవ్రమైన సంకేతం’ అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
కాగా, ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని రాహుల్ గాంధీ ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు.


