‘హగ్‌’ కామెంట్‌ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్‌ | Meloni Mention Modi Target: Rahul Sandeep Dikshit Hug Triggers Heat | Sakshi
Sakshi News home page

‘హగ్‌’ కామెంట్‌ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్‌

Aug 14 2026 7:24 AM | Updated on Aug 14 2026 7:24 AM

Meloni Mention Modi Target: Rahul Sandeep Dikshit Hug Triggers Heat

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్‌ తనయుడు సందీప్‌ దీక్షిత్‌పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 

గురువారంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్‌ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకున్నారు.

ఈ సమయంలో సందీప్‌ దీక్షిత్‌ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్‌ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.

మోదీ ‘హగ్‌ డిప్లమసీ’పై రాహుల్‌ సెటైర్‌
పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్‌, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్‌ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్‌ విమర్శలు
ఇదే కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

‘‘మోదీ, అమిత్‌ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’
కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.

సందీప్‌ దీక్షిత్‌ నేపథ్యం
సందీప్‌ దీక్షిత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కుమారుడు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్‌’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 

షీలా దీక్షిత్‌ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్‌
ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్‌ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్‌ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’
రాహుల్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్‌ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్‌ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.

ట్రెండింగ్‌లో మెలోనీ
ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్‌ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్‌ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్‌లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్‌ గాంధీ హగ్‌ పాలిటిక్స్‌.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement