పెళ్లి సంబంధాల కోసం చాలామంది బంధువులు, స్నేహితుల సహాయం తీసుకుంటారు. కానీ పుణేకు చెందిన ఓ యువకుడు మాత్రం తన పెళ్లి అన్వేషణను ఎక్సెల్ షీట్లో నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏడాది పాటు 53 సంబంధాలను పరిశీలించిన తర్వాత చివరకు తనకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నాడు. ఎలాగంటే..
పుణేకు చెందిన 29 ఏళ్ల వికాస్ లోహ్టియా.. 2025లో అరేంజ్డ్ మ్యారేజ్ కోసం ప్రత్యేకంగా ఓ ఎక్సెల్ ట్రాకర్ను రూపొందించాడు. అందులో పెళ్లి సంబంధాల వివరాలు, అభిరుచులు, అనుకూలతలు వంటి అంశాలను నమోదు చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో అతడి ఎక్సెల్ షీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మెటల్ కంపెనీలో ప్రొక్యూర్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న వికాస్.. దాదాపు ఏడాది పాటు తన పెళ్లి ప్రయత్నాలను కొనసాగించాడు. ఈ సమయంలో 53 మంది ప్రొఫైల్స్ను పరిశీలించాడు. చివరకు గురుగ్రామ్కు చెందిన ఓ ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడగా, ఆ బంధం వివాహానికి దారితీసింది.
తొమ్మిది నెలల పాటు పూర్తిగా అర్థం చేసుకున్నాకే..
గత ఏడాది అక్టోబర్లో పెళ్లి సంబంధాల ట్రాకర్ను ప్రారంభించిన వికాస్కు నవంబర్లో తనకు కాబోయే భాగస్వామి పరిచయమయ్యారు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా దాదాపు తొమ్మిది నెలల పాటు మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.
"ట్రాకర్ను అప్డేట్ చేస్తూనే ఆమెతో మాట్లాడేవాడిని. మూడు, నాలుగు నెలల పాటు ఈ రెండు విషయాలు కొనసాగాయి" అని వికాస్ తెలిపాడు.
వేతనం కూడా ఓకే అయ్యాకే..
పెళ్లి సంబంధాల సమయంలో కొంతమంది అమ్మాయిలకు భర్త ఆదాయం విషయంలో ఎక్కువ అంచనాలు ఉన్నాయని వికాస్ చెప్పాడు. అయితే తన కాబోయే భార్యతో తొలి సంభాషణలో తాను సంపాదించే వాస్తవ ఆదాయంలో సగం మాత్రమే చెప్పానని తెలిపాడు.
అయినా ఆమె తనను తిరస్కరించలేదని, తన వ్యక్తిత్వం, ఆలోచనలు ఆమెకు నచ్చాయని పేర్కొన్నాడు. ఇప్పుడు వికాస్ తన ఎక్సెల్ షీట్లో నమోదు చేసిన 53వ ప్రయత్నాల్లో ఒకటి తన జీవితంలో కీలక మలుపుగా మారింది. డేటాతో మొదలైన అతడి పెళ్లి అన్వేషణ చివరకు ఓ అందమైన బంధంతో ముగిసింది.
(చదవండి: మోడల్స్గా మావోయిస్టు మహిళలు..!)


