సాక్షి, ముంబై: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Mallya) కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక నేరస్తుడు మాల్యా, బ్యాంకుల మధ్య ఏళ్ల తరబడి నడుస్తున్న వాణిజ్య వివాదానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని బాంబే వ్యాఖ్యానించింది.
దశాబ్ద కాలంగా నడుస్తున్న ఈ వివాదం ముగియకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇరు వర్గాలు ఆచరణాత్మక పరిష్కారాల వైపు అడుగులు వేయాలని జస్టిస్ మిలింద్ జాధవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు పురోగతి, జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన ప్రస్తుత సమాచారాన్ని సమర్పించాలని బాంబే హైకోర్టు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించింది.
ఇదీ చదవండి: చాట్జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
తన ఆస్తులను బ్యాంకులకు అప్పగించాలన్న ఆదేశం అన్యాయమని 70 ఏళ్ల మాల్యా వాదించారు. వాణిజ్య వివాదాలకు పరిష్కారాలు తరచుగా ఆ వివాదాలలోనే ఉంటాయని, పక్షాలు సంఘర్షణలో చిక్కుకుపోకుండా ఆచరణాత్మక పరిష్కారాల వైపు పయనించాలని కోర్టు పేర్కొంది.
కాగా అప్పటి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ (KFA)కు వివిధ బ్యాంకులు ఇచ్చిన రూ. 9,000 కోట్ల రుణాన్ని ఎగవేసిన మాల్యాపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. దీంతో 2016 మార్చిలో యూకేకు పారిపోయాడు. 2019లో మాల్యాను "ఆర్థిక నేరస్తుడిగా పరారీలో ఉన్న వ్యక్తి" (Fugitive Economic Offender)గా భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల చట్టం ప్రకారం అధికారులు ఆయన ఆస్తులను జప్తు చేయడానికి వీలు కలిగింది. బ్యాంకు రుణాలకు సంబంధించిన రికవరీ ప్రయత్నాలలో భాగంగా అధికారులు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
అయితే ఈడీ జప్తు చేసిన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వినియోగించుకోవడానికి అనుమతిస్తూ ప్రత్యేక PMLA (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు జారీ చేసిన ఉత్తర్వును 2020లో మాల్యా సవాలు చేశారు. లండన్లో తలదాచుకున్న మాల్యాను తమకు అప్పగించాలని భారతదేశం కోరుతోంది.


