నో మీన్స్‌ నో.. తెహల్కా మాజీ ఎడిటర్‌కు బిగ్‌ షాక్‌ | Big Setback for Tehelka Ex-Editor Tarun Tejpal | Sakshi
Sakshi News home page

నో మీన్స్‌ నో.. తెహల్కా మాజీ ఎడిటర్‌కు బిగ్‌ షాక్‌

Aug 6 2026 11:19 AM | Updated on Aug 6 2026 11:50 AM

Big Setback for Tehelka Ex-Editor Tarun Tejpal

ప్రముఖ జర్నలిస్టు, తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. తన జూనియర్‌ సహోద్యోగిపై అత్యాచారం కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు కొట్టివేసింది. తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. మధ్యాహ్నం శిక్ష ఖరారు కానుంది. అయితే తీర్పు అనంతరం.. కోర్టులో కాసేపు హైడ్రామా నడిచింది.

2013 నవంబర్‌లో గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్‌ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్‌ లిఫ్ట్‌లో తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేయడంతో తేజ్‌పాల్‌పై కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో గోవా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరైంది.

ఈ కేసులో 2014లో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 2017లో గోవాలోని మపుసా కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2021 మేలో కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ నీలా గోఖలే, జస్టిస్‌ అమిత్‌ జంసందేకర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు వెలువడడాని కంటే ముందే తేజ్‌పాల్‌ కోర్టుకు వచ్చారు.

బాధితురాలి ప్రవర్తనపై ముందస్తు అంచనాలు సరికాదు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. లైంగిక దాడి బాధితురాలు ఎలా ప్రవర్తించాలనే ముందస్తు అభిప్రాయాలతో ట్రయల్‌ కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వాదించారు. ప్రతి బాధితురాలి స్పందన ఒకేలా ఉండదని, వ్యక్తిగత పరిస్థితులు, సామాజిక నేపథ్యం, వ్యక్తిత్వం వంటి అంశాల ఆధారంగా మారుతుందని పేర్కొన్నారు.

ట్రయల్‌ కోర్టు తన తీర్పులో బాధితురాలు లైంగిక దాడి అనంతరం సాధారణంగా కనిపించే ప్రవర్తనను ప్రదర్శించలేదని వ్యాఖ్యానించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తుషార్‌ మెహతా.. బాధితుల ప్రవర్తనను ఒకే కొలమానంతో అంచనా వేయలేమని తెలిపారు. ఇటు తేజ్‌పాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అబాద్‌ పొండా వాదనలు వినిపించారు.

నో మీన్స్‌ నో.. అరెస్ట్‌కు డిమాండ్‌
తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించిన అనంతరం ఆయనను వెంటనే అరెస్ట్‌ చేయాలని తుషార్‌ మెహతా కోర్టును కోరారు. బాధితురాలు తన కుమార్తె వయసులో ఉన్నప్పటికీ తేజ్‌పాల్‌ నేరానికి పాల్పడ్డారని, ఆమె నిరాకరించిన తర్వాత కూడా ముందుకు వెళ్లారని వాదించారు. “ఒక మహిళ ‘నో’ అంటే దాని అర్థం నోనే అని సమాజానికి స్పష్టమైన సందేశం వెళ్లాలి” అని తుషార్‌ మెహతా కోర్టులో పేర్కొన్నారు.

మరోవైపు, తీర్పు అనంతరం తరుణ్‌ తేజ్‌పాల్‌ శిక్షలో ఉపశమనం ఇవ్వాలని కోరారు. “నాకు 62 ఏళ్లు. నేను కూడా బాధితుడిననే నమ్ముతున్నాను. నాకు భార్య ఉంది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తాను. దయచేసి నా విషయంలో కొంత సానుభూతి చూపించండి” అని కోర్టును అభ్యర్థించారు.

తెహల్కా-తరుణ్‌ తేజ్‌పాల్‌ నేపథ్యం
తెహల్కా భారత జర్నలిజం చరిత్రలో సంచలనాత్మక దర్యాప్తు కథనాలకు పేరుగాంచిన ప్రముఖ వార్తా మ్యాగజైన్‌. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ.. స్టింగ్‌ ఆపరేషన్లు, అవినీతి బహిర్గతాలు, రాజకీయ–కార్పొరేట్‌ వ్యవహారాలపై పరిశోధనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

తెహల్కా వ్యవస్థాపకుల్లో తరుణ్‌ తేజ్‌పాల్‌ ఒకరు. జర్నలిస్టుగా, రచయితగా ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. 1990లలో జర్నలిజంలోకి వచ్చిన తేజ్‌పాల్‌.. పలు ప్రముఖ ప్రచురణ సంస్థల్లో పనిచేసిన అనంతరం 2000లో తెహల్కా డాట్‌కామ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత దానిని వార్తా మ్యాగజైన్‌గా తీర్చిదిద్దారు.

తెహల్కా నిర్వహించిన కొన్ని స్టింగ్‌ ఆపరేషన్లు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా 2001లో వెలుగులోకి వచ్చిన “ఆపరేషన్‌ వెస్ట్‌ ఎండ్‌” రక్షణ రంగంలో అవినీతి ఆరోపణలపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కథనాలతో తెహల్కా పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే తర్వాతి కాలంలో తేజ్‌పాల్‌ వ్యక్తిగత జీవితం, సంస్థకు సంబంధించిన వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా 2013 లైంగిక దాడి కేసులో హైకోర్టు తీర్పుతో ఆయన పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement