ఆగ్రా: చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహ భాగాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం ఆగ్రా కంట్రోల్ స్టేషన్కు రైలు చేరుకున్న సమయంలో ఒక జనరల్ బోగీలో అనుమానాస్పదంగా పడి ఉన్న ఎర్రటి ట్రాలీ బ్యాగు నుంచి రక్తం కారుతుండటంతో పాటు తీవ్ర దుర్వాసన వెలువడింది. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.
అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా రైల్వే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఈ ఘటనపై వెంటనే స్పందించారు. గ్వాలియర్ స్టేషన్ దాటి ఆగ్రా వైపు వెళ్తున్న రైలులోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఉదయం సుమారు 5 గంటలకు ఆగ్రా కంట్రోల్ స్టేషన్కు రైలు చేరుకోగానే, జీఆర్పీ , ఆర్పీఎఫ్ సిబ్బంది జనరల్ బోగీలోకి ప్రవేశించి ఆ ట్రాలీ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
జీఆర్పీ సర్కిల్ ఆఫీసర్ రాజీవ్ దీక్షిత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్యాగును తెరిచి చూడగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న కాలు, ఉదర భాగానికి సంబంధించిన మృతదేహ అవశేషాలు లభించాయి. ఆ అవశేషాలను ‘చెన్నై’ అని ముద్రించి ఉన్న పాలిథీన్ షీట్తో చుట్టి ఉంచారు. లభ్యమైన అవశేషాలను బట్టి మృతుడు పురుషుడు అయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు ఈ ఘటన విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, నివేదిక వచ్చిన తర్వాతే మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలు స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు. చెన్నైకి ఒక ప్రత్యేక బృందాన్ని పంపి, ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మహత్యలు .. అత్యధికం విధుల్లో ఉన్నప్పుడే..


