ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడే యువతకు అతడు ఒకప్పుడు ఆదర్శం. వరుసగా పోటీ పరీక్షలు రాసి.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 పరీక్షల్లో విజయం సాధించాడు. అతడి సక్సెస్ స్టోరీ చూసి ఎంతోమంది అభ్యర్థులు స్ఫూర్తి పొందారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పేరు పేపర్ లీక్ కేసులో మారుమోగుతోంది. జార్ఖండ్ పరీక్షల కుంభకోణంలో ప్రధాన అనుమానితుడిగా అరెస్టైన అభయ్ కుమార్ తివారీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
అభయ్ తివారీ.. జార్ఖండ్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన 19 మందిలో ఒక్కడు. అయితే అతను సాధించిన విజయాల జాబితా చిన్నది కాదు. నేవీ పరీక్ష, భాభా అణు పరిశోధన కేంద్రం (BARC) పరీక్ష, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష, సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు.. ఇలా అనేక పోటీ పరీక్షల్లో అతడు అర్హత సాధించాడు. 13 ఏళ్లలో 12 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు క్లియర్ చేయడంతో అతడికి “ఎగ్జామ్ స్టార్”గా గుర్తింపు వచ్చింది. అయితే..
ఇప్పుడు దర్యాప్తు సంస్థల ఆరోపణలు మరో కోణాన్ని తెరపైకి తెస్తున్నాయి. “అతడి వరుస విజయాల వెనుక ప్రతిభేనా? లేక పరీక్షల వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకున్నారా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జార్ఖండ్ సీఐడీ ఆరోపణల ప్రకారం.. అభయ్ తివారీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే ఓ నెట్వర్క్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోటీ పరీక్షల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తన వరుస విజయాలనే(సిసలైన సక్సెసా? లేదంటే మోసమా? అనేది తేలాల్సి ఉంది).. నమ్మకంగా మార్చుకుని అభ్యర్థులను ఆకర్షించాడని అధికారులు భావిస్తున్నారు.
పరీక్షల సంస్థతో పాత సంబంధాలు
తివారీ గతంలో పరీక్షల నిర్వహణ సంస్థ TRS-Data Processing Private Limitedలో పనిచేశాడు. పరీక్షల నిర్వహణలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న ఈ సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత అతడు జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా.. పాత పరిచయాలు కొనసాగించాడా? పరీక్షల వ్యవస్థలోకి ఎలా ప్రవేశించాడు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
పేపర్ లీక్తో బయటపడిన అసలు విషయం
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా 14వ JPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తర్వాత నిరసనలు మరింత పెరిగాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
రాంచీలో రోడ్డెక్కిన విద్యార్థులు
రాంచీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పరీక్షలు రద్దు చేయాలని, అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరగా.. ప్రభుత్వం మాత్రం సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.ఇటు సీజేపీ ప్రతినిధి అభిజిత్ దీప్కే కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపారు.
నలుగురు మంత్రులతో కమిటీ
విద్యార్థుల ఆందోళన తీవ్రత పెరగడంతో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. సమస్యలను పరిశీలించేందుకు నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థులతో చర్చలకు ముందుకొచ్చింది. పరీక్షల వ్యవస్థలో లోపాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనలు కొంత తగ్గినా.. విద్యార్థులు మాత్రం కేవలం హామీలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.
ఒక్క తివారీ కేసు కాదు.. వ్యవస్థకే పరీక్ష
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఆదర్శంగా కనిపించిన అభయ్ తివారీ.. ఇప్పుడు అదే పరీక్షల వ్యవస్థపై వచ్చిన అనుమానాలకు కేంద్రంగా మారాడు. అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమా? లేదంటే మరేదైనా కోణం ఉందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మాత్రం దేశంలో పోటీ పరీక్షల భద్రత, పారదర్శకతపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది.


