రేణుకాస్వామి కేసులో కీలక పరిణామం | Darshan in Trouble: A14 Approver Move Shakes Renukaswamy Case | Sakshi
Sakshi News home page

రేణుకాస్వామి కేసులో కీలక పరిణామం

Aug 6 2026 10:54 AM | Updated on Aug 6 2026 10:59 AM

Darshan in Trouble: A14 Approver Move Shakes Renukaswamy Case

కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న ప్రదోష్‌ అప్రూవర్‌ (మాఫీ సాక్షి)గా మారేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని సిటీ సివిల్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్‌ కోర్టు ముందు నిజాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో.. ఈ పరిణామం దర్శన్‌కు కొత్త చిక్కులు తెచ్చే అవకాశముందనే చర్చ మొదలైంది.

రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన నిందితులుగా దర్శన్‌, పవిత్ర గౌడ పేర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఏ14 నిందితుడు ప్రదోష్‌ ప్రస్తుతం అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలను కోర్టు ముందు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషన్‌లో అతను పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు చట్టపరంగా మాఫీ సాక్షిగా(approver) మారే అవకాశం కల్పించాలని కోరాడు.

కేసులో కొత్త మలుపు
ప్రదోష్‌ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే.. రేణుకాస్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సాక్షిగా మారితే కేసులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రదోష్‌ చెప్పే వివరాలను కోర్టు ఎలా పరిగణిస్తుంది? అతడి వాంగ్మూలం కేసులో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

కోర్టు ముందుకు ప్రదోష్‌
ప్రదోష్‌ ఇవాళో, రేపో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అతడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే.. కేసులోని ఇతర నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

2024 జూన్‌లో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి.. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

పోలీసుల కథనం ప్రకారం.. రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసులో నటుడు దర్శన్‌, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్శన్‌పై హత్య కుట్ర, కిడ్నాప్‌, దాడి వంటి అభియోగాలు నమోదు చేసి పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. తొలుత కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ దర్శన్‌ను తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దర్శన్‌ మళ్లీ జైలు పాలయ్యాడు. అయితే.. 

ఈ కేసులో సాక్షుల్ని బెదిరిస్తున్నారంటూ తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే జైల్లో దర్శన్‌ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరగ్గా, కర్ణాటక డీజీపీ దానిని పుకారుగా కొట్టి పారేశారు. 

ప్రదోష్‌ వాంగ్మూలం కీలకమవుతుందా?
తాజాగా ఈ కేసులో ఏ14 నిందితుడు ప్రదోష్‌ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తి సాధారణంగా కేసుకు సంబంధించిన కీలకసమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు అతడి అభ్యర్థనను అంగీకరిస్తే.. కేసులోని మరిన్ని వివరాలు, నిందితుల పాత్రకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement