మోత్కూరు : తన భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ మోత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం భర్తను బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్కు పిలిపించగా.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మోత్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం ఇందిరానగర్ కాలనీకి చెందిన గజ్జెల్లి మనోహర్, ప్రభావతి భార్యాభర్తలు.
వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త ఇబ్బందులు పెడుతున్నాడని ప్రభావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. విచారణ నిమిత్తం మనోహర్ను బుధవారం పోలీసులు స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు స్టేషన్ ఎదుట తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు మనోహర్ను అడ్డుకొని 108 అంబులెన్స్లో భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ సతీష్ తెలిపారు.


