పంజాబ్లోని కపుర్తలా ఫ్యాక్టరీలో రూపొందిన నమూనా కోచ్
ప్యాసింజర్ కమ్ కార్గో డబుల్ డెక్కర్ రైళ్లకు యోచన
వందేభారత్ సిరీస్లో నడపొచ్చన్న రైల్వే బోర్డు కమిటీ
నాలుగేళ్ల నాటి బెల్లీ ఫ్రైట్ కాన్సెప్ట్కు మళ్లీ ప్రాణం..
ప్రధాని కార్యాలయం అభిప్రాయం కోసం నిరీక్షణ
సాక్షి, హైదరాబాద్: విమానాల తరహాలో అప్పర్ డెక్లో ప్రయాణికులు, కింది డెక్లో సరుకులు తరలించే బెల్లీ ఫ్రైట్ పద్ధతిలో ప్యాసింజర్ కమ్ గూడ్స్ డబుల్ డెక్కర్ రైలును రూపొందించే విషయంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోబోతోంది. ఈ కాన్సెప్టులో రైలును రూపొందించే విషయంలో కొంతకాలం వేచి చూసిన రైల్వే బోర్డుకు అధికారుల కమిటీ సానుకూలంగా సిఫారసు చేసింది. దీనిపై ఇప్పుడు రైల్వే శాఖ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం వందేభారత్ గూడ్సు రైలు ట్రయల్స్ ప్రారంభించిన రైల్వే బోర్డు, ఇప్పుడు ప్రయాణికులు–సరుకులను ఒకేసారి తరలించే ప్రత్యేక డబుల్ డెక్కర్ రైలును పట్టాలెక్కించే విషయంపై దృష్టి సారించింది. నాలుగేళ్ల క్రితం ఈ నమూనాకు తుదిరూపం ఇచ్చిన తర్వాత, దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. తాజాగా దాన్ని వందేభారత్ సిరీస్లో కలిపి పట్టాలెక్కించొచ్చని కమిటీ సిఫారసు చేసింది.
నమూనా తయారీ
ఒకేసారి ప్రయాణికులు– తేలికపాటి సరుకులను తరలించే విధానం విమానయాన రంగంలో సక్సెస్ అయింది. దేశంలో రైళ్ల ద్వారా సరుకుల తరలింపు ఏయేటికాయేడు పెరుగుతూ వస్తోంది. ఈ జూలైలో దేశవ్యాప్తంగా రైల్వే ఏకంగా 141.3 మిలియన్ టన్నుల సరుకులను తరలించింది. గతేడాది జూలైలో ఈ సంఖ్య 129.7 మిలియన్ టన్నులు. సరుకు రవాణా ఏటా పెరుగుతుండటంతో వందేభారత్ తరహాలో వేగంగా నడిచే గూడ్సు రైళ్లను పట్టాలెక్కిస్తోంది. కొద్దిరోజుల క్రితం పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని కోటా–సవాయ్ మాధాపూర్ సెక్షన్లో వందేభారత్ గూడ్సు ప్రొటోటైప్ రైలు ట్రయల్స్ మొదలైన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు డబుల్ డెక్కర్ రైలును కూడా పట్టాలెక్కించొచ్చని కమిటీ సూచించింది.
ప్రత్యేక రూఫ్
ఈ–కామర్స్ పార్సిళ్లు, మందులు, ఇతర తేలికపాటి సరుకులను కింది డెక్కులో, ప్రయాణికులను పైడెక్కులో తరలించటం దీని కాన్సెప్ట్. వందేభారత్ ఎగ్జిక్యూటివ్ కోచ్ తరహా ఏర్పాటు పైడెక్కులో ఉంటుంది. దాదాపు 46 సీట్లు, ఓ పాంట్రీ, టాయిలెట్లు ఈ కోచ్లో ఉంటాయి. గరిష్టంగా 6 టన్నుల వరకు సరుకును తరలించే లోయర్ డెక్ ఉంటుంది. ఈ సరుకుకు సంబంధించిన వాసన, ఇతర ప్రభావాలు పైడెక్కులోకి రాకుండా రూఫ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కోచ్లలో స్మోక్ డిటెక్షన్, వీడియో సర్వైలెన్స్ కెమెరా వంటి ఏర్పాట్లు ఉంటాయి. ఒక్కో కోచ్ తయారీకి రూ. 4.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ రైలు కూడా 160 కి.మీ. వేగ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాలుగేళ్ల క్రితం ఈ తరహా కోచ్తో కూడిన ఓ నమూనా కోచ్ను పంజాబ్లోని కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ రూపొందించింది. కానీ, ఆ తర్వాత దానిపై తుది నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టారు.
ఇప్పుడు డబుల్ డెక్కర్ను తీసుకురావాలని కమిటీ తాజాగా పేర్కొంది. కానీ, దీనిపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కొరియర్ సర్వీసులు రోడ్డు మార్గాలపైనే ఎక్కువగా వినియోగిస్తున్నాయి. వేగంగా సరుకులను తరలించటం, శీతలీకరణ వ్యవస్థ అందుబాటులో ఉండటం. సమయపాలన, భద్రత... అంశాల పరంగా చర్యలు తీసుకుంటే తేలికపాటి సరుకుల తరలింపు ఆర్డర్లను భారీగా పొందొచ్చని, రోడ్డు మార్గాన తరలుతున్న సరుకుల్లో చాలా వరకు ఈ రైళ్ల వైపు మళ్లే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా, ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇది గొప్ప అవకాశమని, డబుల్ డెక్కర్ రైళ్లలో ప్రయాణం విషయంలో ప్రయాణికులు ఆసక్తిగా ఉంటారని పేర్కొంటున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. అది సానుకూలంగా ఉంటే, మరో మూడునాలుగు నెలల్లో ప్రొటోటైప్ రైలు ట్రయల్స్ మొదలవుతాయి. లేదంటే, ఈ ఆలోచనకు రెడ్ సిగ్నల్ చూపినట్టవుతుంది.


