ప్లకార్డులు ప్రదర్శించొద్దన్న ఉభయ సభాపతులు
అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు
తీసుకుంటామని స్పషీ్టకరణ
లోక్సభ, రాజ్యసభలో కొనసాగిన విపక్షాల డిమాండ్లు, నినాదాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల్లో విపక్ష పార్టీల సభ్యులు క్రమశిక్షణ, ప్రజాస్వామ్య పద్ధతులకు తిలోదకాలిచ్చారని అటు లోక్సభ స్పీకర్, ఇటు రాజ్యసభ చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన, సభ వెల్లోకి రావడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. సభ గౌరవాన్ని కాపాడకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఇరు సభాపతులు హెచ్చరించారు.
బుధవారం ఉదయం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం మొదలవ్వగానే విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా కల్పించుకున్నారు. ‘‘రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ వంటి శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను సభ్యులు ప్రశ్నల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఇదే సరైన వేదిక. అయితే సభలో పోస్టర్లు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం’’అని అన్నారు.
సభలో క్రమశిక్షణ పాటించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పరిస్థితి చక్కబడకపోవడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమయ్యాక బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్, ఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలు సభలో తమ ఆందోళనను కొనసాగించాయి.
సభాధ్యక్ష స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ ఎంత వారించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ విపక్ష సభ్యులపై మండిపడ్డారు. బిల్లులపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా నాటకాలాడేందుకే పార్లమెంట్కు వచ్చిన విపక్ష సభ్యులు చర్చకు ఏమాత్రం సుముఖంగా లేరని రిజిజు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎలాంటి బిల్లుపై ఎలాంటి చర్చ జరగక్కుండానే ‘బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లు’ను సభ ఆమోదించింది.
బ్రిటిష్ కాలంనాటి చట్టం స్థానంలో ఈ బిల్లు తెచ్చారు. బ్యాంక్ ముద్రిత రికార్డ్ పుస్తకాలతోపాటు ఎల్రక్టానిక్, డిజిటల్, క్లౌడ్ ఆధారిత డేటానూ కోర్టుల్లో చట్టబద్ధమైన ఆధారాలుగా పరిగణించవచ్చంటూ బిల్లును తెచ్చారు. విపక్షసభ్యుల నినాదాల హోరు కొనసాగడంతో సభాపతి లోక్సభను గురువారానికి వాయిదావేశారు. జూలై 20వ తేదీన లోక్సభ సెషన్ మొదలయ్యాక ప్రశ్నోత్తరాల సమయం సంపూర్ణంగా పూర్తికాకుండానే వరసగా 13వ రోజు లోక్సభ వాయిదాపడటం గమనార్హం. ఇన్ని రోజుల్లో లోక్సభలో ఆరు బిల్లులను ఆమోదించారు.
రాజ్యసభలో చైర్మన్ హెచ్చరిక..
రాజ్యసభలో సైతం విపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో లోక్సభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ జోక్యం చేసుకున్నారు. పదేపదే విపక్ష ఎంపీలు వెల్లోకి వచ్చి నిరసనలు తెలపడం పద్ధతికాదు. ప్లకార్డులు ప్రదర్శించొద్దు. నా సూచనలను ఉల్లంఘించే సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వను. వాళ్లకు గుర్తింపు కూడా ఉండదు. అవసరమైతే మరింత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా’’అని హెచ్చరించారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్యను 38కి పెంచుతూ తెచ్చిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఇది ద్రవ్యబిల్లు కావడంతో తిరిగి లోక్సభకు పంపించారు. విపక్షాల ఆందోళనల మధ్యే జీరోఅవర్, ప్రశ్నోత్తరాలను కొద్దిసేపు నిర్వహించి తర్వాత సభను గురువారానికి వాయిదావేశారు.
కూటమి నేతల నిరసన మార్చ్..
జమ్మూకశీ్మర్కు రాష్ట్ర హోదా డిమాండ్తోపాటు జంతర్మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ ఘటనలో హోం మంత్రి అమిత్షా ప్రకటన చేయాలని, అయోధ్య రామాలయంలో కోట్ల రూపాయల విరాళాల చోరీ ఘటనపై పార్లమెంట్లో చర్చించాలన్న డిమాండ్లతో విపక్ష ‘ఇండియా’కూటమి ఎంపీలు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన మార్చ్ చేపట్టారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాందీ, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్, మహువా మొయిత్రా, ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే, జేఎంఎం ఎంపీ మహువా మాఝీ, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ తదితరులు ప్రేరణ స్థల్లోని గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు ఈ మార్చ్ నిర్వహించారు. భారీ బ్యానర్ను ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నినాదాలుచేశారు.


