థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ డైరెక్టర్‌ .. | Microsoft AI Director Thanks Her Mother For Life Saving Kidney Donation | Sakshi
Sakshi News home page

థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ డైరెక్టర్‌ ..

Aug 5 2026 4:04 PM | Updated on Aug 5 2026 4:25 PM

Microsoft AI Director Thanks Her Mother For Life Saving Kidney Donation

ఎంతపెద్ద స్టార్‌ అయినా, దేశాన్ని ఏలే నాయకుడైనా..అనారోగ్యం మందు తలవంచాల్సిందే. తన వద్ద ఎన్ని అధికారాలున్నా..మంచి ఆరోగ్యాన్ని పొందడం అంత సులభం కాదు. అందుకోసం వాళ్లు పడే తపన..జీవితం విలువను, ఆరోగ్యంగా జీవించడం వంటి ప్రాముఖ్యతలను హైలెట్‌ చేస్తుంది. అదే విషయాన్ని భావోద్వేగంగా వివరిస్తోంది ఈ మైక్రోసాఫ్ట్‌ ఏఐ డైరెక్టర్‌. తన తల్లి కారణంగానే ఈ భూమ్మీద మళ్లీ గాలి పీలుస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. 

అసలేం జరిగిందంటే..మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ అండ్‌ ఆసియాన్ లో జెనరేటివ్ ఏఐ కంట్రీ హెడ్ రంజనీ మణి లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో తను ఎదుర్కొన్న అనారోగ్యం గురించి, ఆ వ్యాధి నుంచి తానెలా బయటపడిందో షేర్‌ చేసుకున్నారు. దశాబ్దాలుగా తన కుటుంబాన్ని ప్రభావితం చేస్తున్న వంశపారంపర్య వ్యాధి అయిన ఆటోసోమల్‌ డామినెంట్‌ పాలీసిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌(ADPKD) గురించి అవగాహన పెంచడం కోసం తన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నట్లు తెలిపారు. 

ఇటీవలే 12 రోజుల క్రితం జీవించి ఉన్న దాత నుంచి కిడ్నీ మార్పిడి చేయించుకున్నట్లు వెల్లడించారు. తను ఇప్పటి వరకు చేయించుకున్న సర్జరీలలో అత్యంత కష్టమైనది, భాధకరమైనదని అన్నారామె. మొదట దీన్ని బహిరంగంగా పంచుకోవాలో లేదా అని ఆలోచించి మరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారామె. ఇది జాలి కోసమో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఈ పోస్ట్‌ని పెట్టలేదని అన్నారామె. జన్యుపరమైన వ్యాధి పట్ల జాగురకతతో ఎలా వ్యవహరించాలో చెప్పేందుకని అంటోంది. 

తను చెప్పేది వేరొకరికి తమ ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడంలో ఉపయోగపడితే చాలని అంటున్నారామె. తన తండ్రి 50 ఏళ్ల వయసులో ఇదే ఏడీపీకేడీ వ్యాధితో బాధపడ్డారని చెప్పారు ఆయన మూత్రపిండాలను దెబ్బతీసే ఈ వ్యాధి కారణంగా డయాలసిస్‌పై ఆధారపడటమే గాక..ఆరోగ్యం కూడా ఎలా నెమ్మదిగా క్షీణించిందో వివరించారు. తాను కూడా జస్ట్‌ 20 ఏళ్ల వయసులోనే అదే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు. 

అయితే ఆమె సంవత్సరాల తరబడి ఆరోగ్యంగా, చురుకుగా ఉండేలా, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, వ్యాయామాలతో సమర్థవంతంగా నిర్వహించారు. అయితే గర్భధారణ సమయంలో ఆమెకు ప్రీఎక్లాంప్సియా రావడంతో, 30 వారాలకే బిడ్డకు మందుగా జన్మనిచ్చారు. దాంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఆ తర్వాత తల్లిబిడ్డ కోలుకున్నా..కాలక్రమేణా ఆమె కిడ్నీ పనితీరు దెబ్బతినడం మొదలైంది. శారీరకంగా తనకు మాత్రం ఫిట్‌గానే ఉన్నట్లు అనిపించినా..ఆమె క్రియాటినిన్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. 

దాంతో వైద్యులు ఆమెకు డయాలసిస్ అవసరం పడకకముందే కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని సూచించారు. అంతటి అనారోగ్య పరిస్థితుల్లోనూ ఎంతో యాక్టివ్‌గా వర్క్‌ చేసుకోవడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. నిజానికి మనకు ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలు ఉంటాయి. అవేమి మన ఆరోగ్యానికి తెలియదు కదా అంటోంది. అందుకే జీవితాంతం డయాలసిస్‌ చేయించుకోవడం కంటే..కిడ్నీ మార్పిడికే మొగ్గు చూపింది. అయితే ఆమెకు కిడ్నీని ఇచ్చింది ఎవరో కాదు ఆమె తల్లే. 68 ఏళ్ల వయసులో ఆమె తన కిడ్నీలలో ఒకటి దానం చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. 

ఒకరకంగా ఆమె నాకు రెండుసార్లు జన్మనిచ్చిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. అదే సమయంలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ తనకు అందుబాటులో ఉండటం నిజంగా తన అదృష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తను ఎప్పటికైనా మహిళల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించే ఒక ఏఐ-ఆధారిత నిధిని స్థాపించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏడీపీకేడీ రోగుల కోసం ఒక ఫౌండేషన్‌కు మద్దతు ఇవ్వాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆరోగ్య సంరక్షణల కూడలిలో ప్రజా విధానానికి తన వంతు సహకారం అందించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. 

ప్రస్తుతం తాను ఇప్పుడిప్పుడే కిడ్నీ మార్పిడి సర్జరీ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నట్లు తెలిపారు. తిరిగి తన వర్క్‌లోకి వెళ్లేందుకు కుతూహలంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తను ఈ వ్యాధి నుంచి బయటపడేలా మద్దతుగా నిలిచిన కుటంబ సభ్యులకు, వైద్య బృందాలకు, సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. 

అలాగే నర్సులు అందించే సంరక్షణను కూడా ప్రశంసించారు. వారి పనిని సాంకేతికత ఎన్నటి భర్తీ చేయలేదని అన్నారు. చివరగా ఆమె తన అనారోగ్య పరిస్థితితో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవడం లేదు, ప్లాన్‌ చేసుకున్న అద్భుతమైన పనులన్నీ చేసేలా మళ్లీ పనిలో నిమగ్నమవ్వడానికే వేచిచూస్తున్నా అంటూ పోస్ట్‌ని ముగించారు.

(చదవండి: 99 కేజీల నుంచి 59 కేజీలకు..! ఆ ఐదు ఫుడ్స్‌తోనే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement