ఇండోర్: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వివాహం జరిగి 15 నెలలు గడుస్తున్నా, వేడుకల క్యాటరింగ్ బిల్లు అందకపోవడంతో కేటరర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ మేఘాలయాలో హనీమూన్ సమయంలో హత్యకు గురైన విషయం విదితమే. ఈ సంచలన కేసులో తాజాగా క్యాటరింగ్ బకాయిల వివాదం తెరపైకి వచ్చింది.
2025 మే నెలలో రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం ఘనంగా జరిగింది. అనంతరం మేఘాలయ వెళ్లిన రాజా హత్యకు గురయ్యారు. సోహ్రా ప్రాంతంలోని ఓ లోయలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహతో పాటు ముగ్గురు హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.
కాగా వివాహ వేడుకల నిమిత్తం ఇండోర్కు చెందిన క్యాటరర్ హితేష్ రోహిరాకు ఇరు కుటుంబాలు రూ.11,42,550 విలువైన కాంట్రాక్టును అప్పగించాయి. ఇందులో రూ.8,60,000 మాత్రమే చెల్లించగా, ఇంకా రూ.2,82,550 బకాయి ఉందని హితేష్ తెలిపారు. ఈ బకాయిల చెల్లింపు కోసం రాజా సోదరుడు విపిన్ రఘువంశీని, సోనమ్ సోదరుడు గోవింద్ రఘువంశీని సంప్రదించినప్పటికీ ఇరు కుటుంబాలు వారు సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు.
ఎవరి నుంచి స్పందన లేకపోవడంతో హితేష్ ఏప్రిల్ 1న లీగల్ నోటీసు పంపి, ఆ తర్వాత ద్వారకాపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇది సివిల్ వివాదం కావడంతో క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. మరోవైపు, తమ కుటుంబానికి ఎలాంటి బకాయిలు లేవని విపిన్ తెలిపారు. సోనమ్ సోదరుడే క్యాటరర్ను బుక్ చేశాడని ఆయన వాదించారు. గోవింద్ స్పందిస్తూ.. 15 నెలల తర్వాత మరో ప్రచారం కోసమే క్యాటరింగ్ బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ విచిత్ర పరిణామం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: బుర్ఖాలో కన్వర్ యాత్ర.. సంభల్లో మళ్లీ ఉద్రిక్తత!


