ఆయన ప్రచారం చేస్తే నీ డిపాజిట్‌ గల్లంతే! | Vijay One Campaign Will Cost You Deposit TVK Hits Back at Udhayanidhi | Sakshi
Sakshi News home page

ఆయన ప్రచారం చేస్తే నీ డిపాజిట్‌ గల్లంతే!

Aug 5 2026 8:02 AM | Updated on Aug 5 2026 8:28 AM

Vijay One Campaign Will Cost You Deposit TVK Hits Back at Udhayanidhi

తమిళనాడు రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. నటి త్రిషపై వ్యాఖ్యల వివాదంలో కేసు, అటుపై నాటకీయ పరిణామాల నడుమ అరెస్టైన ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌.. హైకోర్టు ఊరటతో గత రాత్రి విడుదలయ్యారు. ఆ రిలీజ్‌ అయిన వెంటనే ఆయన టీవీకే అధినేత విజయ్‌పై ‘జోకర్‌ సర్కార్‌’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

తంజావూర్‌ పీఎస్‌లో అసభ్యకర వ్యాఖ్యల కేసులో విచారణ అనంతరం గత రాత్రి ఉదయ్‌నిధి రిలీజ్‌ అయ్యారు. ఆ సమయంలో డీఎంకే శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికాయి. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తీసుకున్న చర్యలను “సర్కస్‌ ప్రభుత్వం” వ్యవహారంగా అభివర్ణించారు. 

పోలీసులు తనను ఉగ్రవాదిలా తీసుకెళ్లారని ఆరోపించారు. తన అరెస్టు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఉదయ్‌నిధి అన్నారు. కావేరీ జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీవీకే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మేకేదాటు డ్యామ్‌, కావేరీ నీటి వివాదంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.

అంతేకాకుండా టీవీకే అధినేత విజయ్‌ను ఉద్దేశించి ఉదయ్‌నిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి డబుల్‌మీనింగ్‌ డైలాగు కొట్టలేదని.. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ కేసుపై చట్టపరంగా పోరాడతానని తెలిపారు. 

టీవీకే ఘాటు కౌంటర్‌
ఉదయ్‌నిధి వ్యాఖ్యలకు టీవీకే ఘాటు కౌంటర్‌ ఇచ్చింది. ఆ పార్టీ నేత ఆధవ్‌ అర్జున ఆ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. విజయ్‌ ప్రజల మద్దతుతో రాజకీయాల్లోకి వచ్చారని, డీఎంకేను తాము ప్రత్యర్థిగా కూడా చూడటం లేదని వ్యాఖ్యానించారు.

“మా నాయకుడిని విమర్శించాలంటే అర్హత ఉండాలి. ఉదయ్‌నిధి స్టాలిన్‌కి దమ్ముంటే.. తన తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. ఆ నియోజకవర్గంలో విజయ్‌ ఒక్కసారి ప్రచారం చేసినా చాలు.. ఉదయ్‌నిధికి డిపాజిట్‌ కూడా దక్కదు” అంటూ ఆధవ్‌ అర్జున సవాల్‌ విసిరారు.

త్రిష వ్యాఖ్యలతో మొదలైన వివాదం
కావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్‌ ప్రసంగిస్తుండగా.. ప్రేక్షకుల నుంచి త్రిష పేరు వినిపించింది. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యల్లో ద్వంద్వార్థం ఉందని టీవీకే ఆరోపించింది.

రాజకీయాల్లో మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని టీవీకే విమర్శించింది. ఉదయ్‌నిధి క్షమాపణలు చెప్పేంత వరకు ఊరుకోబోమని అంటోంది. అయితే తన వ్యాఖ్యలకు వక్రీకరణ జరిగిందని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని ఉదయ్‌నిధి వివరణ ఇచ్చారు. డీఎంకే కూడా విజయ్‌ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. 

ప్రస్తుతం ఈ వివాదం డీఎంకే–టీవీకే మధ్య రాజకీయ పోరుగా మారింది. ఇవాళ్టి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement